ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20 వేల కోట్లు

ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20 వేల కోట్లు

విశాఖ: దేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు.  విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో గడ్కరీ ప్రసంగించారు.  ''ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. ప్రధాని మోదీ హయాంలో రహదారుల అభివృద్ధి వేగం పుంజుకుంది. సరకు రవాణా ఖర్చును తగ్గించాలని చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ పోర్ట్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పోర్టులతో రహదారులను అనుసంధానం చేస్తాం. ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తాం. పరిశ్రమలకు లాజిస్టిక్‌ ఖర్చులు తగ్గించడం చాలా ముఖ్యం. ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నాయి. ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ కీలకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఛార్జీలను తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించాలి'' అని కేంద్ర మంత్రి సూచించారు.