ఎదురెదురుగా రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనం

ఎదురెదురుగా రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనం

తెంపీ: గ్రీస్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనమయ్యారు. మరో 85 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఏథెన్స్‌ నుంచి థెసాలోన్కి వెళ్తున్న ఓ ప్రయాణికుల రైలు.. తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును బలంగా ఢీకొట్టింది. ప్రమాద  తీవ్రతకు ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. మరిన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి.

సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్‌ రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద తీవ్రతకు ధ్వంసమైన ముందు బోగీల్లో 32 మంది సజీవదహనమవ్వగా మరికొంతమందిని సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చీకటిగా ఉండటం, మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.