బ్రేకింగ్ న్యూస్ - ఏపీలో టీచ‌ర్ల బ‌దిలీల‌కు బ్రేక్…

బ్రేకింగ్ న్యూస్ - ఏపీలో టీచ‌ర్ల బ‌దిలీల‌కు బ్రేక్…

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది.. గతంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు.. ఎటువంటి బదిలీలూ చేపట్టొద్దని డీఈవోలకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. ఎన్నికలకు ముందు మొత్తంగా 1,800 మంది టీచర్ల బదిలీలు జరిగాయి.. అయితే, పైరవీలు, సిఫార్సులతో ఈ బదిలీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఒత్తిడితో ఈ సిఫార్సులు జరిగాయనే అభియోగాలు కూడా వచ్చిన నేపథ్యంలో మొత్తంగా బదిలీలనే నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది విద్యాశాఖ.

కాగా, ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు గత ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలతో జీవో నెంబర్ 47 జారీ చేసింది ప్రభుత్వం.. 2023 ఏప్రిల్‌ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్లందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మే 31, 2025 లేదా అంతకంటే ముందే ఉద్యోగ విరమణ చేసిన వారికి అభ్యర్ధన మేరకు బదిలీలు చేపట్టాలని.. 2022-23 విద్యా సంవత్సరం నాటికి ఒకే చోట అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులు.. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఇతర ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ మేనేజ్ మెంట్ సర్వీసులో కొనసాగుతున్నారో ఆ విభాగంలోనే బదిలీ అయ్యేలా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారు.. ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు.. ఇందులో భాగంగా తొలి ద‌శ‌లో 1800 మందిని బ‌దిలీ చేశారు.. కొత్త ప్ర‌భుత్వం రానున్న త‌రుణంలో మొత్తంగా టీచర్ల బదిలీలకు బ్రేక్‌ పడింది.