అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా  పొడుస్తాడు: వైఎస్​ జగన్​

అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా  పొడుస్తాడు: వైఎస్​ జగన్​

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. 2023–24 సీజన్‌కు సంబంధించి 52 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు తొలి విడతగా 7 వేల 500 చొప్పున పెట్టుబడి సాయంతో పాటు.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని.. సీఎం జగన్‌ కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ  చేశారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడిచేందుకు వెనుకాడరంటూ పేర్కొన్నారు. రాజమండ్రిలో మహానాడు పేరుతో డ్రామా చేశారన్నారు.

వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తిని ఇప్పుడు యుగపురుషుడు, రాముడు, కృష్ణుడు అంటూ కీర్తిస్తున్నారన్నారు. మ్యానిఫెస్టోను చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తుందని తెలిపారు. మట్టి నుంచి తమ మ్యానిఫెస్టో పుట్టిందని.. కర్ణాటక నుంచి బాబు మ్యానిఫెస్టో పుట్టిందంటూ విమర్శించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని పేర్కొన్నారు. వైసీపీ హామీలు కాపీ కొట్టి.. పులిహోర వండారంటూ పేర్కొన్నారు. 175 సీట్లలో పోటీ చేసేందుకు క్యాండెట్లు కూడా లేరంటూ ఎద్దేవా  చేశారు.  చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే.. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారంటూ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు, వలసలు లేవన్నారు. గత ప్రభుత్వ పాలనకు, మీ బిడ్డ పాలనకూ మధ్య తేడా చూడాలని.. మహానేత వైఎస్సార్‌ జయంతి రోజున ఇన్సూరెన్స్​ సొమ్ము  కూడా జమ చేస్తామంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.