ఎటూ తేల్చని ఏపీ స్కిల్ కేసు తీర్పు.. 

ఎటూ తేల్చని ఏపీ స్కిల్ కేసు తీర్పు.. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు కేసు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 17ఏ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ పిటిషన్ సీజేఐకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏసీబీ చట్టంలోని సెక్షన్ 17-ఎ  కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం అక్టోబరు 17న తీర్పును రిజర్వ్‌ చేసింది. మంగళవారం నాడు తాజా  తీర్పు వెలువరించారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో త్రిసభ్య ధర్మాసనానికి పిటిషన్‌ను పంపబోమని, సీజేఐకి నివేదిస్తామని న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది తెలిపారు. 

చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై డివిజన్ బెంచ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. స్కిల్ కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, అరెస్టు, రిమాండ్‌కు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని వాదిస్తూ గతంలో ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు.. హైకోర్టు తోసిపుచ్చడంతో  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు బెంచ్‌లో జస్టిస్ బేలా త్రివేదీ తీర్పులో తెలిపారు. 2018 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే ట్రయల్ కోర్టు (విజయవాడ ఏసీబీ కోర్టు ) నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కూడా తెలిపారు. కానీ మరో న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు. దీని ప్రకారం చంద్రబాబును సీఐడీ అరెస్టు, దిగువ కోర్టు రిమాండ్ విధించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభ్రిప్రాయలు వ్యక్తం చేసింది. చివరికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.