జర్నలిజంలో పిహెచ్ డి , గోల్డ్ మెడల్ సాధించడం యావత్ విద్యారంగానికి, జర్నలిస్టులందరికీ గర్వకారణం -స్ఫూర్తిదాయకం

జర్నలిజంలో పిహెచ్ డి , గోల్డ్ మెడల్ సాధించడం యావత్ విద్యారంగానికి, జర్నలిస్టులందరికీ గర్వకారణం -స్ఫూర్తిదాయకం
  • విద్యలో అత్యున్నత శిఖరంగా భావించి గోల్డ్ మెడల్ అందుకోవడం సమాజానికి ఓ మంచి సందేశం - తోటి జర్నలిస్టులకు ఆదర్శం
  •  రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు స్వీకరించడంతోపాటుజర్నలిజంలో డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ బంటు కృష్ణను సన్మానించిన ఆత్మీయ స్నేహితులు, రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు

సూర్యాపేట: జర్నలిజం లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ తో పాటు గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై చేతుల మీదుగా అందుకోవడం యావత్ విద్యారంగానికి, జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమని, పట్టు వదలని విక్రమార్కుడిలా చదివి  విద్యలో అత్యున్నత శిఖరంగా భావించే గోల్డ్ మెడల్ అందుకోవడం నేటి సమాజానికి మంచి సందేశం, తోటి జర్నలిస్టులకు ఆదర్శమని సూర్యాపేట చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, బంటు కృష్ణ స్నేహితులు, ఆత్మీయులు అన్నారు.

ఇటీవల రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు పొందడంతో పాటు జర్నలిజంలో పీహెచ్డీ పట్టా పొంది, గోల్డ్ మెడల్ ను రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై చేతుల మీదుగా అందుకున్న డాక్టర్ బంటు కృష్ణ ను గురువారం సాయంత్రం క్లాస్ మేట్స్ ఆత్మీయ మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బంటు కృష్ణ స్నేహితులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్  పెండెం చంద్రశేఖర్, బొలిశెట్టి మధు, ఖమ్మంపాటి రేణుబాబు, సంధ్యల వినోద్ కుమార్, అల్లాడి సత్యనారాయణ లు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా జర్నలిజం లో వివిధ పత్రికలలో పలు హోదాలలో పని చేస్తూనే చదువును ఏనాడు ఆపకుండా చదువుతూ పలు డిగ్రీలు సాధించడమే కాకుండా జర్నలిజంలో డాక్టరేట్, బంగారు పతకం సాధించడం యావత్ జర్నలిస్టు సమాజానికి, విద్యాభిమానులకు గర్వకారణమని ప్రశంసించారు.

రాష్ట్రంలోనే సూర్యాపేట పేరును, ఘనతను చాటి చెప్పే విధంగా గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ బంటు కృష్ణ సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి కావడం ప్రతి ఒక్కరు కూడా సంతోషించే విషయం అని చెప్పారు. తన ఇద్దరు కుమారులతో పాటు తాను కూడా కళాశాలకు వెళ్లడం ఆశ్చర్యకరమైనా ఇది వాస్తవంగా జరుగుతున్న విషయమని, పీహెచ్డీతోనే చదువును ఆపకుండా ఎల్.ఎల్.బి కూడా పూర్తి చేసి ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి తనకు ఉన్న నాలుగు పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలకు అదనంగా  మరొక పీజీ సోషియాలజీ ప్రస్తుతం చేయడం ఆయన కు చదువు పట్ల తీరని దాహానికి నిదర్శనమన్నారు.  అనంతరం బంటు కృష్ణను ఘనంగా శాలువాలతో సన్మానించారు. సన్మాన గ్రహీత డాక్టర్ బంటు కృష్ణ మాట్లాడుతూ  ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత, మానవ సంబంధాలతో కూడిన గౌరవాన్ని తనకు అందించడం జీవితంలో మర్చిపోలేని సంఘటన అని, జర్నలిజం విలువలను, విద్య గొప్పతనాన్ని, జర్నలిస్టులను, తనను గుర్తించి సన్మానించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ప్రభుత్వ ఉపాధ్యాయులు నల్ల శ్రీనివాస్, చింతమల్ల జానయ్య, విజయ్, అంజయ్య, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.