డి పి ఆర్ ఓ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి

డి పి ఆర్ ఓ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
  • ప్రజావాణిలో యూనియన్లకు అతీతంగా వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు, డిపిఆర్ఓ పై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
  •  జర్నలిస్టులను కావాలని ఇబ్బందులకు గురి చేసినట్టు రుజువైతే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని జర్నలిస్టులకు హామీ ఇచ్చిన కలెక్టర్

 ముద్ర ప్రతినిధి సూర్యాపేట: జర్నలిస్టులను కావాలని ఇబ్బందులకు గురి చేసినట్లయితే డిపిఆర్ఓ రమేష్  పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.  సోమవారం యూనియన్లకు అతీతంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో  ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో వివరించిన ప్రకారం  ఈనెల 27న శనివారం రోజు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ల పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా డిపిఆర్ఓ వ్యవహరించిన తీరు పలు జర్నలిస్టుల ను మనస్థాపానికి గురి చేసే విధంగా ఆయన వ్యవహారం శైలి ఉందన్నారు. ప్రముఖ పత్రికలు, చానళ్లు అంటూ డిఎస్పీకి ప్రొసీడింగ్స్ పంపడంతో పాటు చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, చిన్న చానళ్ళు,పెద్ద చానళ్లు అంటూ విలేకరుల మధ్యన విభేదాలకు డిపిఆర్ఓ కారకుడు అయ్యాడని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

కొందరు విలేకరులను మాత్రమే మున్సిపల్ కార్యాలయంలోనికి అనుమతించి, మిగతా జర్నలిస్టులను అనుమతించకుండా పోలీసులతో అడ్డుకొని అవమానపరిచాడనీ, జోన్ 1 నుండి అక్రమంగా జోన్ 2 లో అర్హత లేకున్నా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడని, అక్రిడిటేషన్ జారీలో  అవకతవకలకు పాల్పడ్డారని, విలేకరుల మనోభావాలను ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కించపరిచేలా ప్రవర్తించారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కు ఇచ్చిన వినతిపత్రంలో వివరించారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బంటు కృష్ణ, ఐత బోయిన రాంబాబు గౌడ్,  పాల్వాయి జానయ్య, బుక్కా రాంబాబు, నాయిని శ్రీనివాసరావు,గన్నోజు జనార్ధన చారి,  నాగరాజు, సురేష్, ఎరుకల సైదులు గౌడ్, కొండ శ్రీనివాసరావు, మామిడి శంకర్, మామిడి శ్రవణ్, పడిశిరి వెంకట్, నజీర్, జహీర్, నందిపాటి సైదులు, వాసా చంద్రశేఖర్, గిరీష్, వెంకట్రావు, రాజు, ప్రవీణ్, రమేష్, వెంకటేష్, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.