నిందితుల అరెస్టు
ముద్ర,పెబ్బేరు (ఏప్రిల్ 15 ): వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ఉగాది పండుగ రోజు అర్ధరాత్రి 9 షాపుల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులను పెబ్బేరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కొత్తకోట సీఐ రాంబాబు ఎస్సై హరిప్రసాద్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. కర్నూల్ జిల్లా కేంద్రం అరోరా నగర్ కు చెందిన శివ తన స్నేహితులైన మరో ముగ్గురు మైనర్లతో కలిసి ఈ చోరీలకు పాల్పడినా. ఉగాది పండుగైన మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి పెబ్బేరు టౌన్లో 2 స్కూటీలపై రెక్కీ చేసి ఆ రోజు అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 గంటల వరకు 4 షాపుల్లో మొబైల్ ఫోన్లు, రెండు ట్యాబ్లను చోరీ చేశారు. మిగతా షాపుల తాళాలు తెరిచి చోరీ చేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ నెల 15 న సోమవారం తెల్లవారుజామున పోలీసులు పెబ్బేరు బైపాస్ వద్ద వాహనాలు చెక్ చేస్తుండగా వారిపై అనుమానమొచ్చి వారిని చెక్ చేయగా వారి వద్ద గద్వాల్, పెబ్బేరులో చోరీ చేసిన రెండు ఐ ఫోన్లు, పోకో, రియల్ మి, ఒప్పో ఫోన్లు, రెండు ట్యాబ్లు, వాటి విలువ రూ.3.50 లక్షల దాకా ఉంటుంది. రూ.3,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్ తరలించి విచారణ చేయగా నిజాలు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రెండు స్కూటీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 3 మైనర్లను మహబూబ్నగర్లోని జువైనల్ కోర్టులో హాజరు పరిచి, శివపైకేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. కేసు త్వరితగతిన ఛేదించినందుకు ఎస్సైని, పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.