త్యాగాల ఫలితమే బిజెపి ఆవిర్భావం - బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:ఎందరో గొప్ప నేతల త్యాగం ఫలితంగా బిజెపి ఆవిర్భవించిందని నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో బిజెపి 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకావిష్కరణ అనంతరం మాట్లాడుతూ ఎందరో నాయకుల త్యాగాల ఫలితంగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు.
ఇపుడు ప్రపంచానికే మార్గదర్శనం చేసే స్థాయికి వెళ్లిందని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందే విధంగా పనిచేస్తుందని అన్నారు. రెండు స్థానాల నుండి 400 స్థానాలకు చేరుకుందని రానున్న రోజుల్లో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి నగేష్ ను గెలిపించి నరేంద్ర మోడీకి కానుకగా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి,రాష్ట్ర నాయకులు రావుల రామనాథ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అయ్యన్న గారి రాజేందర్, నాయకులు తోట సత్యనారాయణ, భూపతిరెడ్డి, అల్లం భాస్కర్, రావుల రాము, రాజు తదితరులు ఉన్నారు.