విజయ్​సంకల్ప్ యాత్రపై బీజేపీ ఫోకస్!

విజయ్​సంకల్ప్ యాత్రపై బీజేపీ ఫోకస్!
  • రాష్ట్రవ్యాప్త పర్యటనకు అధిష్ఠానం ప్లాన్
  • కిషన్​రెడ్డి, డీకే అరుణ, ఈటల, బండితో బస్సు యాత్ర?
  • లక్ష్మణ్, జితేందర్​రెడ్డి సేవలు వాడుకోవాలన్న హైకమాండ్
  • అసెంబ్లీ, పార్లమెంట్​సీట్లపైనే ఫోకస్
  • మాజీ సీఎం కిరణ్​కుమార్ రెడ్డి ద్వారా చేరికలకు ప్లాన్

ముద్ర, తెలంగాణ బ్యూరో : విజయ్​సంకల్ప్ యాత్ర పేరుతో తెలంగాణవ్యాప్తంగా పర్యటించాలని బీజేపీ హైకమాండ్​ఆలోచిస్తోంది. ఇందుకోసం బీజేపీ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ యాత్రల ద్వారా విస్తృతంగా తిరిగితేనే పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్త పర్యటనకు ప్రణాళిక పంపాలని అయా పార్టీల నేతలను అధిష్ఠానం కోరింది. దీంతో బీజేపీ స్టేట్​చీఫ్ కిషన్​రెడ్డి యాత్ర కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏయే ప్రాంతం నుంచి ఎవరెవరూ తిరిగితే బాగుంటుందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ముందుగా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల నుంచి నలుగురిని తిప్పాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కిషన్​రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్​ను విజయ సంకల్ప్​యాత్రలకు తిప్పాలని అధిష్ఠానం సూచించింది. అవసరమైతే డాక్టర్​లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి సేవలు వాడుకోవాలని అధిష్ఠానం సూచించింది. 

  • బస్సు ద్వారా యాత్ర?

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విజయ సంకల్ప్​యాత్రలు ప్రారంభం కానున్నాయి. యాత్రల ముగింపును పురస్కరించుకొని భారీ బహిరంగ సభను నిర్వహించేలా వ్యూహరచన చేస్తున్నారు. కాగా ఈ యాత్రలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎవరెవరు ఎక్కడి నుంచి యాత్రలు ప్రారంభించాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకోలేదు. ఈ యాత్రలపై పార్టీ నాయకత్వం చర్చిస్తుంది. ఈ సమయంలో పాదయాత్రకు సమయం సరిపోనందున బస్సుల ద్వారా యాత్రను చేయాలని  బీజేపీ నేతలు భావిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్ల నుంచి డీకే అరుణ, కరీంనగర్​నుంచి బండి సంజయ్, ఖమ్మం​జిల్లా నుంచి రాజేందర్, ఆదిలాబాద్​జిల్లా నుంచి కిషన్​రెడ్డితో యాత్ర నడిపిస్తే బాగుంటుందని అధిష్ఠానం భావిస్తోంది. మరో ఇద్దరు నేతలను తీసుకుంటే మరో రెండు ప్రాంతాలను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. 

  • పార్టీ విస్తరణే లక్ష్యంగా ప్రణాళిక..

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీజేపీ వేగంగానే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేయనున్నదో యాత్రల ద్వారా ప్రజలకు వివరించనున్నది. జూలై మొదటి వారంలో  దక్షిణాదికి చెందిన పార్టీ అధ్యక్షులతో బీజేపీ నేషనల్​చీఫ్​జేపీ నడ్డా సమావేశమయ్యారు. దక్షిణాదిలో పార్టీ విస్తరణ లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది. ఈ రాష్ట్రాల నుంచి మెజార్టీ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ నాయకత్వం ముందుకు వెళ్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు.  గోషామహల్ తప్ప ఏ స్థానంలో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించలేదు. అయితే  2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. ఆ తర్వాత  జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. మునుగోడులో  రెండో స్థానంలో నిలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు స్థానాల నుంచి 48 కార్పొరేట్ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ కు ఊతమివ్వగా, బీజేపీకి నిరాశను కల్గించాయి. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో చేరికలు పెరిగాయి. అయితే  దీనికి కౌంటర్ గా బీజేపీ కూడా  తమ పార్టీలో వలసలను ప్రోత్సహిస్తుంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో చేరికలపై ఫోకస్ పెట్టారు. శ్రావణ మాసంలో మరికొందరు నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.