బీజేపీలో చేరిన బీఆరెస్  ఎంపీటీసీలు

బీజేపీలో చేరిన బీఆరెస్  ఎంపీటీసీలు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల నియోజకవర్గంలోని దండెపల్లి మండలానికి చెందిన ఇద్దరు బీఆరెస్ ఎంపీటీసీలు బీజేపీలో చేరి ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావుకు షాక్ ఇచ్చారు. గురువారం లింగాపూర్ ఎంపీటీసీ బోడ అమృత, వెల్గనూర్ ఎంపీటీసీ చుంచు మల్లమ్మ బీఆరెస్ ను వీడారు. ఈమేరకు గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా  రఘునాథ్ రావు మాట్లాడుతూ, బీజేపీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల ను దృష్టిలో పెట్టుకుని రైతు రుణమాఫీ చేశారని విమర్శించారు. కేసీఆర్ 2014, 2018 ఎన్నికల సందర్భంగా చేసిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇవ్వాలని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు రైస్ మిల్లర్లతో మిలాఖతై రైతుల ధాన్యం కొనుగోలులో తరుగు పేరిట కోత పెట్టారని  ఆరోపించారు. గూడెం ఎత్తిపోతల పథకం పైపులైన్ తరచు పగలడం వలన పంటలకు నీరందక రైతులు ఇక్కట్లు పడ్డారని తెలిపారు. ఈకార్యక్రమంలో చుంచు లక్ష్మీనారాయణ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.