ఆరు గ్యారెంటీలు కాదు పేద బిడ్డల ప్రాణాలకు గ్యారెంటీ కావాలి

  • గురుకులాలు వసతి గృహాల్లో ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించాలి
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలు ముఖ్యం కాదని, పేద బిడ్డల ప్రాణాలకు గ్యారెంటీ కావాలని, గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించాలని బీ ఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్దిని వైష్ణవి కుటుంబాన్ని ఆదివారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించి, వైష్ణవి కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళనలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర క్యాబినెట్ లో ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ సంక్షేమ మంత్రులు లేకపోవడం శోచనీయమన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై అధికార,ప్రతిపక్ష నాయకులు చర్చించకపోవడం దురదృష్టకరం ఆని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థినిల ఆత్మహత్యలపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని,మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.


ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతి పై సమగ్ర విచారణ జరపి,కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి : 

సూర్యాపేట జిల్లా ఇమాంపేట సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల కళాశాలలో మరొక ఇంటర్ విద్యార్థి దగ్గుపాటి వైష్ణవి మృతి చెందటం బాధాకరం అని, విద్యార్థుల మరణాలపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రముఖ న్యాయవాది, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తళ్లమళ్ళ హసేన్  ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి ని హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలి, కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కుటుంబాన్ని అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైష్ణవి అనుమానాస్పద మృతి కారకులను కఠినంగా శిక్షించాలి


ఇమాంపేట సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన దగ్గుబాటి వైష్ణవి అనుమానస్పద మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ గురుకుల కళాశాల ముందు జరిగిన ధర్నా  సందర్భంగా  కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.