10th paper Leak బండి సంజయ్కు 14 రోజుల రిమాండ్..
ముద్ర, వరంగల్: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేసులో హనుమకొండలోని మొదటి సెషన్స్ కోర్టు జడ్జి అనిత రాపోలు ఎదుట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు ప్రవేశపెట్టారు. ఇరు వర్గాల లాయర్ల వాదనలు విన్న అనంతరం జడ్జి.. బండి సంజయ్కు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. అనంతరం బండి సంజయ్ను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించారు.
సంజయ్పై కమలాపూర్ పోలీసులు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 120 బీ, సెక్షన్ 420, 447, 505 సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సంజయ్ను ఏ1గా, ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సుభాష్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శ్రామిక్, ఏ10గా పోతబోయిన వర్షిత్ పేర్లను చేర్చారు. మొత్తం పది మందిపై కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.