తాడేపల్లి ప్యాలెస్ వైపు రూట్ క్లియర్..! ఆనందం వ్యక్తం చేస్తున్న ఆ మార్గంలోని నివాసితులు

తాడేపల్లి ప్యాలెస్ వైపు రూట్ క్లియర్..! ఆనందం వ్యక్తం చేస్తున్న ఆ మార్గంలోని నివాసితులు

అమరావతి, ముద్ర వార్తలు: అధికారంలోవున్నపుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  తాడేపల్లి ప్యాలెస్ వైపు కన్నెత్తి కూడా ఎవరూ చూసేందుకు సాహసించేవారు కాదు.. ఆ ప్యాలెస్ కు చుట్టుపక్కల నివసించే వారు కూడా ఆ దారిలో వెళ్లడానికి కూడా పర్మిషన్ లేదు. సొంత ఇంటికి వెళ్లడానికి కూడా ఆ ప్రాంత నివాసితులకు నానా ఇబ్బందులు తప్పలేదు. అయిదేళ్లపాటూ వారు నరకం అనుభవించారు. ఇప్పుడు తాడేపల్లి మార్గంలో తిరగడానికి సెక్యూరిటీ ఆంక్షలను కొత్త ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడంతో ఆ ప్రాంతీయులంతా ఎంతో సంతోషిస్తున్నారు.

   
కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ వద్ద సెక్యూరిటీ అడ్డంకులు తొలగిపోయాయి. ఇన్నాళ్లూ ఆ రోడ్డులో రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారమని స్థానికులు చెబుతున్నారు. దాదాపు కిలోమీటర్ పైనే రోడ్డు జగన్ సెక్యూరిటీ అధీనంలో ఉండేదని, ఆ రూట్ లో ఎవరు వచ్చినా పోలీసులు ఆపేవారని చెప్పారు. తాడేపల్లిలో జగన్ ప్యాలస్ సమీపంలో ఉండే ఓ డాక్టర్ తాజాగా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కున్న దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎలాంటి అవరోధాలు, సెక్యూరిటీ తనిఖీలు లేకుండా తొలిసారి ప్రయాణిస్తున్నానంటూ ఆ వీడియోలో చెప్పారు.

ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ లో రీపోస్ట్ చేసింది. తన ఇంటి పక్కన నివసించే ప్రజలను జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టేవాడో అక్కడ ఉండే ఓ డాక్టర్ చెబుతున్నాడు వినండంటూ క్యాప్షన్ జోడించింది. ఏపీ సీఎం నివాసం కావడంతో తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ ముందు సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఉండేదని సదరు డాక్టర్ చెప్పారు. ఆసుపత్రికి వెళ్లేటపుడు, తిరిగి వచ్చేటపుడు సెక్యూరిటీ పేరుతో పోలీసులు తమ వాహనాన్ని ఆపేసి సోదాలు చేసేవారని అన్నారు. ప్రతిరోజూ ఇదే తంతు కొనసాగేదని, దీంతో చాలా ఇబ్బంది పడ్డామని వివరించారు. తాజాగా ఈ రోడ్డులో సెక్యూరిటీ పోస్ట్ ఎత్తేయడంతో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని హర్షం వ్యక్తం చేశారు.