‘గులాబీ’తో కలసి కామ్రేడ్ల అడుగులు

‘గులాబీ’తో కలసి కామ్రేడ్ల అడుగులు
  • వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలకు కొన్ని స్థానాలు
  • ఏపీలో టీడీపీతో కలిసి నడుస్తున్న సీపీఐ

హైదరాబాద్‍, జనవరి: తెలంగాణలో కమ్యునిస్టులు బీఆర్‍ఎస్‍తో నడిచేందుకు సిద్ధమయ్యారు.  మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‍ఎస్‍కు కమ్యూనిస్టు పార్టీలు మద్దతు తెలిపాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీని వ్యతిరేకించే బీఆర్‍ఎస్‍ పక్షాన నిలిచేందుకు ఇటు సీపీఐ, ఇటు సీపీఎంలు మానసికంగా సిద్ధమయ్యాయి. ఇరు పార్టీల నేతలు ఓపెన్‍గానే తాము బీఆర్‍ఎస్‍తో కలసి నడుస్తామని చెప్పారు. ఇటు కేసీఆర్‍ కూడా 2018 లో జరిగే శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలతో కలసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అవసరమైతే మిత్రపక్షాలుగా చేర్చుకుని కొన్ని స్థానాలను త్యాగం చేయడానికి కూడా గులాబీ బాస్‍ రెడీ అయ్యారు.  మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత తమ వల్లనే బీఆర్‍ఎస్‍ గెలిచిందని కామ్రేడ్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు. శాసనసభలో తాము అడుగుపెట్టాలంటే అధికార టీఆర్‍ఎస్‍తో వెళ్లడమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు.

సీపీఎం అయితే ఇటీవల జాతీయ మహాసభలను నిర్వహించి తమ బలం ఏంటో చూపించింది. సీపీఐ కూడా స్పీడ్‍ పెంచింది. కేసీఆర్‍ కూడా తన పార్టీ ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. కామ్రేడ్ల అండ కొంత అవసరమని ఆయన కూడా భావిస్తున్నారు. అందుకే సీపీఐ, సీపీఎంలకు వారు ఆశించినన్ని సీట్లు కాకపోయినా 2018లో జరిగే ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు వారికి కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది.  అదే సమయంలో ఇప్పుడు బీఆర్‍ఎస్‍ ఆంధప్రదేశ్‍లోకి ఎంటర్‍ అయింది. నేతలను చేర్చుకుంటోంది. ఏపీలో పార్టీని విస్తరించేందుకు కేసీఆర్‍ ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. త్వరలో కేసీఆర్‍ బహిరంగ సభను కూడా ఏపీలో పెట్టబోతున్నారు. అయితే ఏపీలో ఇప్పటి వరకూ కమ్యునిస్టు పార్టీలు టీడీపీ పక్షాన నడుస్తున్నాయి.

సీపీఎంను కొంత పక్కన పెట్టినా సీపీఐ మాత్రం అవుట్‍రైట్‍గా చంద్రబాబు పక్షాన నిలబడుతోంది. అంశాలతో సంబంధం లేకుండా చంద్రబాబుతో నడిచేందుకు సీపీఐ నేతలు సిద్ధమయిపోయారు. అక్కడ శాసనసభలో అడుగుపెట్టడానికి టీడీపీ సాయాన్ని ఎర్రసైన్యం తీసుకుంటుంది. కానీ బీఆర్‍ఎస్‍ ఏపీలో పెడితే తెలంగాణలో ఒక తరహా, ఏపీలో ఒక మాదిరిగా వ్యవహరిస్తుందా? అన్న అనుమానం కలుగుతుంది. బీఆర్‍ఎస్‍ను టీడీపీ ఏపీలో కలుపుకోదు. ఎందుకంటే అదే జరిగితే ఏపీలో రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసు. అదే సమయంలో కామ్రేడ్లు తెలంగాణలో కలసి పోటీ చేసి, ఏపీలో మాత్రం బీఆర్‍ఎస్‍ కు వ్యతిరేకంగా పోటీ చేయడంపై ఖచ్చితంగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. దానికి రెండు ప్రాంతాల నేతలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. రెండు వేర్వేరు రాష్ట్ర శాఖలని చెప్పుకోవాలని చూసినా సీపీఐ, సీపీఎం లు జాతీయ పార్టీలుగానే చూస్తారు. అందుకే కామ్రేడ్ల స్టాండ్‍ ఇప్పుడు ఏపీలో ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది.