మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు

మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగుర వేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడగానే మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివసగృహం నుంచి బాజాలతో ప్రదర్శన నిర్వహించారు. బెల్లంపల్లి చౌరస్తా మీదుగా కూరగాయల మార్కెట్, ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.

అనంతరం మిఠాయిలు పంచిపెట్టి బాణాసంచాలు కాల్చారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు హర్షణీయమన్నారు. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలనపై విసుగు చెంది ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి ఇతర నేతలు పాల్గొన్నారు.