కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది

కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది
Manchyryala MLA Nadipelli Diwakar Rao

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయి నామరూపాలు లేకుండా పోతుందని మంచిర్యాల శాసనసభ్యుడు నడిపెళ్లి దివాకర్ రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల స్థాయి ఆత్మీయ సమ్మేళనం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నస్పూర్ లో జరిగిన సభలో కాంగ్రెస్ నేతలు  ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయడం శోచనీయమని అన్నారు.  భవిష్యత్తు లేని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణలు చేయడం తగదని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు.

 ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఆదర్శ నేతగా గుర్తింపు పొందాడని  కొనియాడారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో కమిషన్ తీసుకుంటున్నానని ఆరోపించడం అర్ధరహితమని అన్నారు. దమ్ము ,ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణలు  నిరూపించాలని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమకూర్చిన సొమ్ముతో  భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారని విమర్శించారు. 32 రోజులు ఉమ్మడి జిల్లాలోని పాదయాత్ర చేయడం విక్రమార్కకే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు.