ఇద్దరు కుమార్తెలను చంపి దంపతుల బలవన్మరణం

ఇద్దరు కుమార్తెలను చంపి దంపతుల బలవన్మరణం

కర్ణాటకలో ఓ కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడింది. ఓ లాడ్జిలో దిగిన ఆ దంపతులు ఇద్దరు కుమార్తెలను చంపి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళూరులో చోటుచేసుకుంది. మూడు రోజులకు పైగా ఆ కుటుంబం లాడ్జి గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో సిబ్బంది స్పేర్ కీతో డోర్ తీయగా ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.  మృతులను పోలీసులు గుర్తించారు. దేవేంద్ర (48), ఆయన భార్య నిర్మల (46), ఈ దంపతుల కవల కూతుళ్లు చైత్ర, చైతన్యలుగా ధ్రువీకరించారు. చైత్ర, చైతన్యలు తొమ్మిదేళ్ల చిన్నారులు. ఈ కుటుంబం మైసూరుకు చెందినది.  ఈ కుటుంబం మార్చి 27వ తేదీన లాడ్జిలో దిగింది. మూడు రోజులపాటు బసకు ఏర్పాటు చేసుకున్నారు. 30వ తేదీన వారు వెకేట్ చేయాలి. కానీ, ఆ తేదీ దాటినా ఇంకా వారు బయటకు రాలేదు. దీంతో అనుమానంతో సిబ్బంది స్పేర్ కీ సహాయంతో డోర్ తెరిచారు. అంతే.. నలుగురి మృతదేహాలు కనిపించాయి. ఆర్థిక సమస్యల వల్ల ఆ కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు చెప్పారు.  ముందుగా పిల్లలను ఆహారంలో విషం కలిపి చంపేశారని అనుమానిస్తున్నారు. ఆ తర్వాత దేవేంద్ర.. తన భార్య నిర్మలను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం, దేవేంద్ర కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దేవేంద్ర ఉరి  తాడుకు వేలాడుతూ కనిపించాడు. భార్య, ఇద్దరు పిల్లలు బెడ్ పై విగత జీవులుగా కనిపించారు. ఆ గది నుంచి ఓ డెత్ నోట్ లభించింది. ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్య నిర్ణయానికి వచ్చామని అందులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.