అయ్యో గోమాత..

అయ్యో గోమాత..
  • కరెంట్ షాక్ తో ఆవు మృతి..
  • చనిపోయిన తల్లి పాలు తాగిన దూడ

కేసముద్రం, ముద్ర: విద్యుదాఘాతంతో ప్రమాదవశాత్తు ఆవు మృతి చెందగా.. తల్లి మరణించిన విషయం తెలియని దూడ తల్లి పాలు తాగిన ఘటన చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన భానోత్ హరికుమార్ అనే రైతుకు చెందిన ఆవు సోమవారం విద్యుత్ ఘాతంతో మృతి చెందింది. ఆవు మరణించగా.. పక్కనే ఉన్న దూడ అంబా.. అంబా అరుస్తుండడంతో ఆ రైతు దూడను విప్పాడు. చనిపోయిన ఆవు వద్దకు వెళ్లిన దూడ తల్లి చనిపోయిన విషయం తెలియక పాలు తాగింది.

ఈ హృదయ విదారక దృశ్యం చూసిన రైతు కుటుంబంతోపాటు తండావాసులు కన్నీరు మున్నీరయ్యారు. ఇదిలా ఉంటే వర్షానికి తడిసిన గోడకు విద్యుత్ వైరు ఉండడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి గోడకు విద్యుత్ సరఫరా జరిగి ఆవు మృతి చెందింది. ఆవు విద్యుత్ షాక్ తో కింద పడగానే హరి కుమార్ అక్కడికి పరుగున రాగా అతనికి రబ్బర్ చెప్పులు ఉండడంతో ప్రమాదానికి గురికాకుండా తప్పించుకోగలిగాడు. విద్యుత్ షాక్ జరిగిందని తెలుసుకొని వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ అప్పటికే ఆవు మృతి చెందింది.