పాములు పట్టే వ్యక్తి– పాముకాటుతో మృతి

పాములు పట్టే వ్యక్తి– పాముకాటుతో మృతి

ముద్ర.వీపనగండ్ల:-పాములు పట్టి పొట్టకూటి కోసం వాటిని ఆడిస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి అదే పాము కాటుకు గురై మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు గ్రామస్తుల కథన ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎరుకలి దొప్పలయ్య కులవృత్తితోపాటు వంశపారపరంగా వచ్చిన పాములు పట్టే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండలంలోని గ్రామాల్లో ప్రజలకు ఎక్కడ పాము కనపడిన వాటిని పట్టడానికి దొప్పలయ్య పిలిపించి అతనితో పాములను పట్టనిచ్చేవారు.పట్టుకున్న పాములను అడవిలో వదిలి వచ్చేవాడు.

నాగుపాములను పట్టుకుంటే మాత్రం కుటుంబ బ్రతుకుతెరువు కోసం వారం రోజులపాటు గ్రామాలలో వాటిచేత ఆటలాడిస్తూ ప్రజలు ఇచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. శుక్రవారం తన ఇంటి వద్ద మట్టి కుండలో భద్రపరిచిన నాగుపామును బయటకు తీస్తుండగా పాము కాటు వేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించటంతో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. పాములను పట్టుకుని జీవనం సాగిస్తున్న ఎరుకలి దొప్పలయ్య అదే పాము కాటుకు గురై మృతి చెందటం విధిరాత. మృతునికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు.