800 మందిని తొలగించిన డెలాయిట్
- ఆర్థిక మందగమనమే కారణం
లండన్: బ్రిటిష్ దిగ్గజ మల్టీనేషనల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ డెలాయిట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆడిట్, మేనేజ్మెంట్ కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, రిస్క్ అడ్వైజరీ, టాక్స్, లీగల్ సర్వీసులు అందిస్తుంది. రెవెన్యూ, ఉద్యోగుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ ఇదే. ఇప్పుడు ఈ సంస్థ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ కింగ్డమ్లో 800 మందికిపైగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఇలా ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని పేర్కొంది డెలాయిట్ యూకే. ఇది యూకేలో తన మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 3 శాతం మందిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించింది. యూకేలో డెలాయిట్ ఉద్యోగుల సంఖ్య 27000గా ఉంది. ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తి లేఆఫ్స్ గురించి రాయిటర్స్కు నివేదించారు.
ప్రపంచంలోనే టాప్-4 అకౌంటింగ్ సంస్థల్లో ఒకటైన డెలాయిట్.. ప్రస్తుతం మందగమనంలో ఉంది. ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. తమ క్లయింట్లు ఖర్చు పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తుందని.. తగిన ప్రాజెక్టులు రావట్లేదని, ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఈ తీవ్రత మరింత ఎక్కువ అవొచ్చని పేర్కొంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఆర్థిక మందగమనం నేపథ్యంలో దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి. టెక్ ఇండస్ట్రీలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అమెజాన్ ఏకంగా 18 వేల మంది ఉద్యోగుల్ని తొలగించగా.. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు 10 వేల మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే. మెటా, ట్విట్టర్ కూడా ఇదే బాటలో పయనించాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఈ సంస్థలకు ఉద్యోగుల్ని తొలగించడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. ఇప్పుడు డెలాయిట్ కూడా అదే పని చేసింది.