సుస్థిర అభివృద్ధికి బీజం

సుస్థిర అభివృద్ధికి బీజం
  • జి–20 సమావేశాల ముగింపు
  • జి–21 బాధ్యతలు బ్రెజిల్ కు అప్పగించిన ప్రధాని మోడీ
  • ‘వన్​ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్​ఫ్యూచర్’​పైనే ప్రధాన చర్చలు
  • మోడీని ప్రశంసలతో ముంచెత్తిన పలు దేశాధ్యక్షులు
  • విశ్వాసలోటుకు ముగింపు పలకాలని సూచనలు
  • అక్షరధామ్ ను సందర్శించిన రిషి సునాక్
  • మహాత్ముడికి నివాళులర్పించిన దేశాధినేతలు

ముద్ర, నేషనల్ బ్యూరో : భారత్ అట్టహాసంగా రెండు రోజులపాటు నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సు దిగ్విజయంగా ముగిసింది. భారత్ అధ్యక్షతన ఈసారి జీ20 కూటమిలో సంచలన నిర్ణయాలకు బీజం పడింది. జీ20 కూటమిని విస్తరించడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఢిల్లీ డిక్లరేషన్‌కు కూటమి దేశాలు ఆమోదం తెలపడంతో ఈసారి సమావేశాలు మరింత కీలకంగా మారాయి. ఈ సందర్భంగా సదస్సు తీర్మానాలను ప్రధాని మోడీ వెల్లడించారు. సమావేశాల ముగింపు సందర్భంగా వచ్చే యేడాది జీ21 శిఖరాగ్ర సమావేశాల అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు భారత్ అప్పగించింది. జీ21 కూటమిని విస్తరించి ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చుకోవడం, ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం కల్పించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో భారత్‌‌ సక్సెస్‌ఫుల్‌గా సమ్మిట్ ను ముగించింది. ఈ క్రమంలోనే అధికారికంగా జీ21 అధ్యక్ష బాధ్యతలను అప్పగించే ప్రక్రియ కూడా పూర్తయింది. అధ్యక్ష బాధ్యతల అప్పగింతలో భాగంగా బేటన్ లాంటి గవెల్‌ను బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అందించారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన అంశాలను చేర్చినందుకు భారత్‌కు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా ధన్యవాదాలు తెలిపారు.

ఎంతో సంతోషాన్నిచ్చింది

జీ20 సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ముగింపు ఉపన్యాసం చేశారు. సమావేశాలలో ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్‌’కు సంబంధించిన విషయాలపై విస్తృత స్థాయిలో చర్చించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మోడీ అన్నారు. పలు కీలక అంశాలపై జీ–20 కూటమి దేశాలు చర్చించాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితిలో చేయాల్సిన సంస్కరణల గురించీ ప్రస్తావించారు. ఇండోనేషియా, బ్రెజిల్, భారత్ త్రయం మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. వారికి తమ సహకారం పూర్తిగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశాలకు సంబంధించి ప్రధాని మోడీని బ్రెజిల్ అధ్యక్షుడు ప్రశంసలతో ముంచెత్తారు. సామాజిక అంశాలైన ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, ఇంధన పరివర్తన, సుస్థిర అభివృద్ధిని జీ–20 ప్రాధాన్యతలు చేర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో తీసుకురావాల్సిన మార్పులను ప్రధాని మోడీ ప్రస్తావించడం అభినందనీయమని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐరాసలో శాశ్వత సభ్యత్వం అందిస్తే, తాత్కాలిక సభ్యదేశాలు కూడా రాజకీయంగా బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఐఎంఎఫ్ వద్ద మరింత ప్రాతినిధ్యం కోరుకుంటున్నట్లు లులా డా సిల్వా వివరించారు. అంతర్జాతీయ పెరుగుతున్న విశ్వాస లోపానికి ముగింపు పలకాలని ఈ జీ20 సదస్సులో చర్చించడం మరో పెద్ద విజయమని పేర్కొన్నారు. అంతర్జాతీయ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేయడం వలన అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల మధ్య కొత్త సంబంధాలకు ఆరంభమని ప్రధాని మోదీ చెప్పారు. జీ20 దేశాలన్నీ ఏకగ్రీవంగా ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం ఇవ్వడం అనేది ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయంగా శాంతి, సుస్థిరత సాధించేందుకు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని అన్ని దేశాలు ఆమోదించినట్లేనని స్పష్టం చేశారు.

శిలాజ ఇంధనాలపై చర్చ లేదు

రష్యా, చైనా అధినేతల గైర్హాజరీలోనూ ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం కల్పించడం మరో విశేషం. ఈ సందర్భంగా 2030 నాటికి అంతర్జాతీయ పునరుత్పాదక శక్తి సామర్థ్యాలను మూడింతలు చేయాలని జీ20 సభ్య దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా దేశాలలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బొగ్గును దశలవారీగా తగ్గించే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించాయి. ఆయిల్, గ్యాస్ సహా అన్ని శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగించడానికి తీసుకునే చర్యలపై ఎలాంటి చర్యలను ప్రకటించకపోవడం గమనార్హం. 

అక్షరధామ్​లో రిషి సునాక్ పూజలు

యూకే ప్రధాని రిషి సునాక్,​ఆయన సతీమణి అక్షతా మూర్తి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు యూకే ప్రధానికి ఆలయ నమూనాను బహుమతిగా ఇచ్చారు.

మహాత్ముడికి నివాళులు

ఆదివారం రెండో రోజు జీ–20 సమావేశాలకు ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధికి పలు దేశాధినేతలు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌, చైనా ప్రధాని లీ కియాంగ్‌ ప్రీమియర్‌, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌, టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌, జపాన్‌ ప్రధాని పుమియో కిషిదా, సింగపూర్‌ ప్రధాని లీ సియన్‌ లూంగ్‌, నెదర్లాండ్స్‌ పీఎం మార్క్‌ రుట్టే, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫట్టా అల్‌-సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్‌ టినుబు, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌, స్పెయిన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నాడియా క్వాలినో తదితరులు ఉన్నారు.