కరాచీ బేకరీ కిచెన్ లో సిలిండర్ పెలి అగ్ని ప్రమాదం

కరాచీ బేకరీ కిచెన్ లో సిలిండర్ పెలి అగ్ని ప్రమాదం
  • పేలుడుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:- రాజేంద్రనగర్ లోని గగన్ పహాడ్ పారిశ్రామిక ప్రాంతం లోని కరాచీ బేకరీ వంటగది లో పేలుడు సంభవించింది. బేకరీలోని సిలిండర్ పేలడంతో గురువారం నాడు  భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బేకరీలోని పరిస్థితి దారుణంగా తయారయింది.  పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.


పేలుడుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం

గగన్ పహాడ్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన పేలుడుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు ఉన్నట్లుగా సీఎంకు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఎనిమిది మందిని కంచన్‌బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి తరలించినట్లు వారు ముఖ్యమంత్రికి చెప్పారు. కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన పేలుడు ధాటికి పదిహేను మంది కార్మికులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పేలుడు ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.