కెసిఆర్‌ ప్రచారంలో ఉచిత విద్యుత్తే హైలైట్‌

కెసిఆర్‌ ప్రచారంలో ఉచిత విద్యుత్తే హైలైట్‌

జాతీయ  రాజకీయాల్లోకి ప్రవేశించిందుకు పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌ అప్పుడే తన పాపులర్‌ పథకం 24 గంటల  ఉచిత కరెంట్‌ గురించి చెప్పేశారు. దేశంలో 24 గంటల కరెంట్‌ రెండేళ్లలోనే అందిస్తామని ప్రకటించారు. ముందుగా  రేపటి కర్నాటక ఎన్నికల్లో దీనిని అమలు చేస్తామని ప్రకటించబోతున్నారు. జనతాదళ్‌తో అవగాహనతో పోరాడుతామంటున్న కేసీఆర్‌  అక్కడ రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు నినాదాలు ఇస్తారనడంలో  సందేహం లేదు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ కేసీఆర్‌ పాపులర్‌ పథకాలు మరోమారు ప్రచారాంశం కానున్నాయి. రాజకీయ విమర్శలతో పాటు పథకాల పనితీరు ముందుకు రానున్నాయి. ప్రధానంగా 24 గంటలు కరెంటు  అందిస్తున్న తీరును ఆయన బాగా ముందుకు తేనున్నారు. ఎండాకాలంలో ఊరూరా కరెంట్‌ వస్తున్న విషయాన్ని బాగా ఫోకస్‌ చేయనున్నారు. తెలంగాణ గత ఎనిమిదేళ్లుగా  ఎక్కడా లోటుపాట్లు లేకుండా విద్యుత్‌ సరఫరాలో ముందున్నది. ప్రధానంగా ఈ ఎనిమిదేళ్లలో విద్యుత్‌ సమస్యను అధిగమించామనే చెప్పాలి.. అది కొని ఇస్తున్నారా..లేక మరో రకంగా ఇస్తున్నారా అన్నది అప్రస్తుతం. ఎందుకంటే కరెంట్‌ వెతలతో నానా కష్టాలు పడ్డ సామాన్యులకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు కరెంట్‌ లేదు..రాదు అన్న ఆలోచన లేకుండా చేసిన ఘనత  కెసిఆర్‌దే. ఈ విషయాన్ని  మొహమాటం లేకుండా ప్రజలే చెబుతారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత గత ఎనిమిదేళ్ల కాలం పరిశీలిస్తే  సిఎం కేసీఆర్‌  కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారనే చెప్పాలి. ఇలాంటి నిర్ణయాలతో  తెలంగాణ పురోగమనంలో కీలక అడుగులు పడ్డాయి.  ప్రధానంగా జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక ఘట్టంగా పేర్కొనాలి. పాలనా వికేంద్రీకరణలో ఇదో మైలురాయి. స్వాతంత్య్రం వచ్చాక ఇంతటి కీలక నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను పాలనా వికేంద్రీకరణలో భాగంగా 33 జిల్లాలు  చేశారు. దేశంలో ఇంతటి అరుదైన నిర్ణయం తెలంగాణలో మాత్రమే జరిగింది.  ప్రధానంగా కేసీఆర్‌  ఇప్పుడు రైతుల ఎజెండాను భుజానికి ఎత్తుకున్నారు. రైతుబంధుతో పాపులర్‌ అయిన  కేసీఆర్‌ ఇప్పుడు వారినే నమ్ముకున్నారు. అలాగే వివిధ పథకాల ద్వారా లబ్ధి  పొందిన వారినే ఓటు బ్యాంక్‌గా గ్రహించారు. ఇందులో భాగంగానే భారతదేశంలోనే గొప్ప రైతులు, ధనవంతులైన రైతులు, ధనవంతులైన యాదవులు ఎక్కడ ఉన్నారంటే..

తెలంగాణ రాష్ట్రంలోనే అని చెప్పుకోవాలన్నారు.  దళితులు, గిరిజనుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దేశంలోనే అతి ఎక్కువ సమయంలో ఆర్థికప్రగతి సాధించాం..  అతికొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించుకున్నాం. మిషన్‌ భగీరథ..కాళేశ్వరం ప్రాజెక్ట్‌.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం..ఇవన్నీ కూడా  కేసీఆర్‌ కలల ప్రాజెక్టులు. నీళ్లు,నిధులు నియామకాలు అన్న స్లోగన్‌తో ఉద్యమాన్ని గమ్యం చేరేలా చేసి...అధికారం చేపట్టిన తరవాత ఇలాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు.  ప్రస్తుతం అమలవుతున్న వాటిలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ముఖ్యమైనవి.  ఇకపోతే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో కూడా తెలంగాణ ఓ వెలుగు వెలుగుతోంది. దేశానికి ఈ పథకం ఆదర్శంగా మారింది.  ఇప్పుడు పెద్ద ఎత్తున డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం సాగుతోంది. రెండు పడక గదుల ఇళ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఉద్యోగాల భర్తీ పక్రియనూ సర్కారు వేగవంతం చేసింది. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో గతంలో మునుపెన్నడూ జరగని పనులు జరిగాయని చెప్పుకోవాలి. ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందజేసే మిషన్‌ భగీరథ, చెరువులను పునరుద్ధరించి వాటిలో పుష్కలంగా నీళ్లు ఉండేటట్టు చూసే మిషన్‌ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్లు, 36 లక్షల మందికి ఆసరా పథకం కింద పెన్షన్లు అందజేత వంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టింది.  కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ లాంటివి పేదలకు వరంగా నిలిచాయి. అన్నింటికి మించి హరితహారం కార్యక్రమం తెలంగాణకు పెద్ద అసెట్‌ అయ్యింది. మొక్కల పెంపకం పెద్ద ఉద్యమంగా సాగుతోంది. నిరంతర విద్యుత్‌, నీటి సరఫరా, ఎరువులు విత్తనాలు అందచేత, పెట్టుబడి సాయం కింద ఎకరాకు 10వేలు అందచేసే కార్యక్రమం, రైతులకు బీమా పథకం..ఇవన్నీ కూడా అద్భుతాలు గానే చూడాలి. కెజి టూ పిజిలో భాగంగా  గురుకులాల ఏర్పాటు కూడా ఓ విప్లవాత్మకమైన మలుపుగా చెప్పుకోవాలి. పేదలకు ఉచిత విద్యను అందించే క్రమంలో ఇదో అపురూపమైన ఘట్టంగా చెప్పుకోవాలి. చేపట్టిన పనిని చివరి వరకు వదలకుండా చేసే మొడి ధైర్యం కెసిఆర్‌ది. తను చేపట్టిన పని విజయవంతంగా పూర్తి చేయడమే తప్ప వెనుదిరిగి చూడని ధృడచిత్తం కేసీఆర్‌కే సొంతం.  ఈ క్రమంలో ఈ పథకాలను దేశంలో చర్చకు ఇప్పడు సిద్దం అవుతున్నారు. కర్నాటకలో వీటిని బాగా పాపులర్‌ చేయబోతున్నారు. అక్కడ జనతాదళ్‌ అధికారంలోకి వస్తే ఈ పాపులర్‌ పథకాలు అమలవుతాయి. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అభాసు పాలయ్యింది. ఇక కేసీఆర్‌  రంగంలోకి దిగితే పరిణామాలు మారే అవకాశం ఉంది.