డ్రగ్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ

డ్రగ్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ
  • ముగ్గురు కార్మికులకు అస్వస్థత
  • గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలింపు

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- డ్రగ్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ కారణంగా ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన సంఘటన భూదాన్ పోచంపల్లి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని నారాయణగిరి సమీపంలో గల సాయి తేజ డ్రగ్స్ కంపెనీలో బీహార్ రాష్ట్రానికి చెందిన మున్నాలాల్, పరమేశ్వర్, దేవశారన్ పనిచేస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం పని ముగించుకొని నిద్రిస్తుండగా కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే కంపెనీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా 108 అంబులెన్స్ లో కార్మికులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మున్నాలాల్ కు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడంతో 108 సిబ్బంది సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి కంపెనీలోని గ్యాస్ లీక్ అయిన ప్రదేశాన్ని సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని అక్కడ పనిచేస్తున్న కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు.