కేసీఆర్ నేతృత్వంలో  స్వర్ణ యుగం 

 కేసీఆర్ నేతృత్వంలో  స్వర్ణ యుగం 

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు
 రామన్నపేట, ముద్ర: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో స్వర్ణ యుగం  నడుస్తోందని  రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డితో కలిసి రామన్నపేట మండల కేంద్రంలో  రూ. 5 కోట్ల 50 లక్షలతో  నిర్మించనున్న 50 పడకల ఆసుపత్రి భవనానికి, చెన్నకేశవ ఆలయ పనులకు శంకుస్థాపన చేశారు.  సబ్ ట్రెజరీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని,  దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య కారకులని అన్నారు. ముఖ్యమంత్రి ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చి తాగునీటి కష్టాలు తీర్చారని, ఏ అక్క కూడా బిందెలతో రోడ్డు మీదికి రాకుండా ఎండాకాలంలో కూడా మంచినీళ్లు అందిస్తున్నారని తెలిపారు.  ఆనాడు ఉన్న 24 లక్షల పెన్షన్లను ఈనాడు 44 లక్షలకు పెంచి 2 వేల రూపాయల పెన్షన్ కల్పించారని,  తద్వారా  వృద్ధులకు ధైర్యం వచ్చిందని అన్నారు.

 ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచారని, ఆడబిడ్డ ఉన్న తల్లికి కొండంత అండగా కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకాన్ని అందిస్తున్నారని అన్నారు. సర్కారీ దవాఖానాలలో ప్రసవాలు పెరిగాయని, ప్రభుత్వ ఆసుపత్రులు  నాణ్యమైన ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నాయని అన్నారు.  ఈరోజు రామన్నపేట మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రికి మరో 10 కోట్లు మంజూరు చేస్తూ మొత్తం 15 కోట్లతో ఆధునిక పరికరాలు, ఏర్పాట్లతో ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని అన్నారు.  నకిరేకల్ లో 35 కోట్లతో వంద పడకల ఆసుపత్రి కడుతున్నామని, నల్లగొండ,  సూర్యాపేటలో  వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు.  బీపీ,  షుగర్,   ఎ.ఎం.సి. చెకప్ లు నిరంతరం జరుగుతున్నాయని చెప్పారు. అధునాతనమైన వసతులు, ఏర్పాట్లతో ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు పెరిగాయని అన్నారు. 

 గతంలో ఉత్త కరెంటు ఉండేదని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి  నిత్యం కోతలు ఉండేవని,  తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాక ఆ పరిస్థితిని దాటి గత 10ఏళ్లుగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని   అన్నారు. సంవత్సరానికి రెండుసార్లు ఎకరానికి 5 వేల పెట్టుబడి సహాయం అందిస్తున్నామని,  ఉచిత కరెంటు ఇస్తున్నామని,  పెన్షన్లు,  కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,  కేసీఆర్ కిట్లు, ఇంటింటికీ  మంచినీరు,  నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.  రోడ్లు,  డ్రైనేజీలు బాగు చేసుకుంటున్నామని అన్నారు.   రామన్నపేట చెరువు పూడికతీతకు 2 కోట్లు,   కాలువల నిర్మాణానికి మరో 2 కోట్లు మొత్తం నాలుగు కోట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి  మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజలకు నిరంతరం మంచి చేయాలనే వ్యక్తి నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అని అన్నారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ  పనిచేసే శాసనసభ్యులు ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుంది అనేదానికి సాక్ష్యం శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అని అన్నారు.

60 సంవత్సరాలు వెనుకబడిన ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతనే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ   రామన్నపేటలో  రూ. 5 కోట్ల 50 లక్షలతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, అలాగే చెన్నకేశవ ఆలయ  నిర్మాణ పనులకు రూ.  2 కోట్ల 50 లక్షలు ముఖ్యమంత్రి మంజూరు చేశారని చెప్పారు.   మండల కేంద్రంలో రోడ్లు వెడల్పు పనులను రూ. 10 కోట్లతో చేపట్టామని అన్నారు. అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి నాయకత్వంలో వేగంగా జరుపుకుంటున్నామని అన్నారు.  ఈ  కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,  రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,  భువనగిరి శాసనసభ్యులు పైళ్ళశేఖర్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి,  రాష్ట్ర ఆయిల్ ఫెడ్  కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి,  రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు దూదిమెట్ల బాలరాజు, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర,  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.