సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో జర్నలిస్టులు కీలకం

  • జర్నలిజంలో పిహెచ్ డి , గోల్డ్ మెడల్ సాధించడం యావత్ జర్నలిస్టులందరికీ గర్వకారణం
  • విలువలతో కూడిన జర్నలిజం నేటి సమాజానికి అవసరం
  • రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు స్వీకరించడంతోపాటుజర్నలిజంలో డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ బంటు కృష్ణ సన్మాన కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు, దుర్గామాత కమిటీ అధ్యక్షులు నాగవెల్లి ప్రభాకర్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, విలువలతో కూడిన జర్నలిజం నేటి సమాజానికి చాలా అవసరమని సీనియర్ ఉపాధ్యాయులు, దుర్గామాత కమిటీ అధ్యక్షులు నాగవెల్లి ప్రభాకర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు పొందడంతో పాటు జర్నలిజంలో పీహెచ్డీ పట్టా పొంది, గోల్డ్ మెడల్ ను రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై చేతుల మీదుగా అందుకున్న డాక్టర్ బంటు కృష్ణ ను శనివారం కాలనీవాసులు ఘనంగా సన్మానించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జర్నలిజంలో డాక్టరేట్, బంగారు పతకం సాధించడం యావత్ జర్నలిస్టు సమాజానికి గర్వకారణమని ప్రశంసించారు.

అలాంటి ఘనతను సాధించిన సూర్యాపేట జిల్లా వాసి, మన వీధి సభ్యుడైనందుకు మనందరికీ కూడా గర్వకారణమని చెప్పారు. ప్రతివారు కూడా ఆపదలో ఉన్న తోటి వారిని ఆదుకోవాలని, జర్నలిస్టులు కూడా పేదల కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని, ఆ విధంగా సమాజ సేవను జర్నలిస్టులు తమ బాధ్యతగా చేస్తున్నారని గుర్తు చేశారు. ఇంకా కాలనీవాసులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీపాద ఉపేందర్, సంద్యాల వినోద్, అల్లాడి సత్యనారాయణ సునీల్, మంకెన రవీందర్ రెడ్డి, కృష్ణయ్య, కొండూరు వెంకన్న, పుప్పాల తిరుమలరావు తదితరులు మాట్లాడుతూ డాక్టర్ బంటు కృష్ణ ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం బంటు కృష్ణ అనసూయ దంపతులను ఘనంగా శాలువాలతో సన్మానించి మేమెంటోలు అందజేశారు. సన్మాన గ్రహీత డాక్టర్ బంటు కృష్ణ మాట్లాడుతూ కాలనీవాసులు గుర్తించి ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత, మానవ సంబంధాలతో కూడిన గౌరవాన్ని తనకు అందించడం జీవితంలో మర్చిపోలేని సంఘటన అని, జర్నలిజం విలువలను, జర్నలిస్టులను, తనను గుర్తించి సన్మానించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.