సర్పంచుల హక్కులు  కాల రాస్తున్నారు..

సర్పంచుల హక్కులు  కాల రాస్తున్నారు..
  • నిధులు విడుదల జాప్యంతో అప్పుల ఉబిలోకి సర్పంచులు..
  • బలహీన వర్గాల హక్కులు కాలరాస్తున్నారు: ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర అభివృద్ధికి ఆయువు పట్టైన గ్రామాలను అభివృద్ధి పథంలో నడుపుతూ జాతీయ స్థాయిలో అవార్డులు సాదించడంలో కీలకమైన సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం తో అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ తాటిపర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గ్రామాల్లో హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచులు, పాలక మండలి సభ్యులు విజయవంతంగా చేపడుతున్నారని, రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచులకు ఆరు మాసాలుగా నిధులు మంజూరు కాకపోవడంతో అప్పుల పాలయ్యారన్నారు. ఒక్కొక్క సర్పంచ్ కు రు. 20 నుండి రు.50 లక్షల నిధులు రావాల్సి ఉన్నాయి. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సర్పంచులు బిల్లులు రాక బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి నెలకొందని  జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జగిత్యాల మండల పరిషత్ అధ్యక్షుడు కోవిడ్ తో మృతి చెంది రెండేళ్లు గడుస్తున్న ఎంపీపీ పదవి భర్తీ చేయడం లేదని, బలహీన వర్గాలకు రిజర్వ్ చేసిన ఎంపీపీ పదవిలో ఇతర వర్గం వారు అధికారం చెలాయించడం.. బలహీన వర్గాల హక్కులు కాలరాయడమే అన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్ కావాలంటూ, మహిళా సాధికారిక త కోసం ఉద్యమిస్తున్న నాయకులు రాష్ట్రంలో మహిళకు రిజర్వ్ చేసిన స్థానం మహిళకు చెందేలా చర్యలు చేపట్టాలని, మహిళకు కేటాయించిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవిలో మహిళకు కూర్చోబెట్టలని హితవు పలికారు. వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తీసుకువచ్చి పనులు చేపట్టామని ఆరు నెలలుగా నిధులు విడుదల కాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రాంట్లు మాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సర్పంచులు మూర్తులుగా మారారని, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తూ పనులు చేయించారన్నారు. జగిత్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో నిధులు విడుదల జాప్యాన్ని నిరసిస్తూ పెట్రోల్ డబ్బాలతో వెళితే పెట్రోల్ పోసుకుంటే నిధులు విడుదల అవుతాయని ఎద్దేవా చేశారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులు అప్పులఉబిలో నుండి బయట పడేలా  ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సర్పంచులు కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, కాంగ్రెస్ మండలాద్యక్షుడు జున్ను రాంజెందర్, పిసిసి ఎన్ ఆర్ ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ చాంద్ పాషా, సర్పంచులు రమ్యలక్ష్మాన్, సరిత శ్రీనివాసరెడ్డి, ఎంపిటిసి భుమారెడ్డి, బీరం రాజేష్, లైసెట్టి విజయ్ పాల్గొన్నారు.