ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట...

ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనవచ్చునని హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఎన్నికల పోలింగ్ సమయంలో పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసంను అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్ బూత్ వద్ద మహిళపై దుర్భాషలాడిన కేసు, కారంపూడిలో సీఐపై దాడి చేసిన కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి హైకోర్టుకు వెళ్లారు. మూడు పిటీషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం ఇరువర్గాల వాదనలు విన్నకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. మూడు కేసుల్లో పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.