కాంగ్రెస్ లో మైనంపల్లి చిచ్చు..!
- నిన్న మెదక్, నేడు మల్కాజిగిరి
- ఇద్దరు డీసీసీ అధ్యక్షుల రాజీనామా
ముద్ర, తెలంగాణ బ్యూరో :మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తంలో చేరిక మేడ్చల్ కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. తన కుమారుడు రోహిత్ కు మెదక్ ఎమ్మెల్యే టిక్కెట్టు ఖరారు చేయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఉన్న అసంతృప్తితో గత నెల 28న ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి.. రోహిత్ కు మెదక్,తనకు మల్కాజిగిరి టిక్కెట్టు దాదాపు ఖరారు చేయించుకుని వచ్చారు. దీంతో మల్కాజిగిరి నుంచి పోటీకి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆశలు అడియాశలయ్యాయి. దీంతో కాంగ్రెస్ ను వీడుతున్నట్టు సోమవారం ప్రకటించిన శ్రీధర్.. తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు పంపారు. మరోవైపు.. రోహిత్ కు మెదక్ టిక్కెట్టు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండడంతో ఆ స్ధానం నుండి పోటీకి సిధ్దమైన పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి సైతం ఈ నెల ఒకటో తేదీన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండ్రొజుల్లో ఇద్దరు డీసీసీ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో ఇంకొందరు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో శ్రీధర్, తిరుపతి రెడ్డి ఇంకెంత మంది పార్టీ వీడుతారోననే చర్చ హాట్ టాపిక్ గా మారింది.