మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తొలిసారిగా సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి వీరు జిల్లాకు రావడంతో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు సంవత్సరాలు అవమానాలు పడ్డారు. నేను మాట ఇస్తున్నాను. రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెబుతాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్సై దగ్గరకు వెళ్లినా, ఎమ్మార్వో దగ్గరకు వెళ్లినా ఎండీవో దగ్గరకు వెళ్లినా ఏ ఆఫీస్‌కు వెళ్లినా మీరు పసుపు బిళ్ల పెట్టుకొని వెళ్లండి మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్‌లో పెడతాను.

ఎవరైనా ఒకరో ఇద్దరో నా మాటకు జవదాటితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని… 2019-24లో పరిపాలన ఎలా జరిగిందో చూశామన్నారు. రాష్ట్రంలో తన పార్టీ తప్ప ఇంకొకరు ఉండకూడదన్నట్లు జగన్ వ్యవహరించారన్నారు. ఎప్పుడూ ఇన్ని బాధలు పడలేదన్నారు అచ్చెన్న. పార్టీ ఉంటుందా లేదా అని నిద్రలేని రాత్రులు గడిపానని , కష్టపడి పనిచేశానని తెలిపారు.