అంగవైకల్యం సంభవించకుండా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి

అంగవైకల్యం సంభవించకుండా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
  • 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరి
  • జిల్లా కేంద్రంలోని మాణ్యం చెల్క అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియోను  ప్రారంభం
  • పల్స్ పోలియో ప్రారంభించిన ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ముద్ర ప్రతినిధి, నల్గొండ:5 సంవత్సరాల లోపు పిల్లలు పోలియో వ్యాధి దారిన పడకుండా 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క అర్బన్  ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో 5  సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేసి పల్స్ పోలియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో వ్యాధి బారినపడిన పిల్లలకు అంగవైకల్యం సంభవిస్తుందని అందువల్ల అంగవైకల్యం బారిన పడకుండా పిల్లలను రక్షించుకునేందుకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో సుమారు 1,61,925 మంది ఐదు సంవత్సరాలు లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని, ఇందుకుగాను 981 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, 3,924 మంది ఉద్యోగులను పోలియో చుక్కలు వేసేందుకు నియమించడం జరిగిందని, నూటికి నూరు శాతం  5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాలు, ఫ్యాక్టరీలు, రైల్వే స్టేషన్లు,బస్టాండ్ల వద్ద  చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని కోరారు. అంతకుముందు  ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండలరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఇమ్యునైజెషన్  అధికారి డాక్టర్ జమీర్, జిజిహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ నిత్యానంద, ఎం సి హెచ్ పి ఓ డాక్టర్ అరుంధతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.