దశాబ్ద కాలంలో చేసిందేమిటి?...రాష్ర్ట మంత్రి సీతక్క

దశాబ్ద కాలంలో చేసిందేమిటి?...రాష్ర్ట మంత్రి సీతక్క

ముద్ర ప్రతినిధి, నిర్మల్:గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో బి ఆర్ ఎస్, కేంద్రంలో బీజేపీ చేసిందేమిటని రాష్ర్ట పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. నిర్మల్ జిల్లా రత్నాపూర్ కాండ్లీ లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

ఆంగ్లేయుల ఏలుబడిలో ఉన్న భారతదేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాలకు నిలయమని అన్నారు. పదేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటున్న మనలో విభేదాలు పెంచుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన 6 హామీలు ఇప్పటికే అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

తమ మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ప్రజలకుఏ కష్టం వచ్చినా ముందుండి వాటిని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళకు రూ.1లక్ష నగదు సాయంతో పాటు నెలసరి పింఛన్లు, సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరిరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని, రాష్ట్రంలో అమలయ్యే పథకాలు కేంద్రంలో కూడా అమలవుతాయని చెప్పారు.

పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో మోసగించిందే తప్ప, అమాయక, పేద ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఈనెల 13న ప్రతి ఒక్కరు బాధ్యతగా చేతి గుర్తుకు ఓటు వేసి అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణ ను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.‌ ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, మహిళా విభాగం కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి , కొట్టే శేఖర్, భీం రెడ్డి ,సయ్యద్ సిరాజ్ ,గాజుల రవికుమార్, పూదరి అరవింద్, కొంతం గణేష్ తదితరులు ఉన్నారు.