శాశ్వత ప్రాతిపదికన పోలింగ్ స్టేషన్ల ఆధునికీకరణ

శాశ్వత ప్రాతిపదికన పోలింగ్ స్టేషన్ల ఆధునికీకరణ
  • ఖమ్మం జిల్లాలో కలెక్టర్ విపి గౌతమ్ కొత్త ఆలోచన
  • పోలింగ్ స్టేషన్ల వద్ద కనీస సౌకర్యాల కల్పన
  • ప్రభుత్వ పాఠశాలలకు పెయింటింగ్ ,టాయిలెట్స్ ,ట్యూబులు , ఫ్యాన్లు
  • ఇవి విద్యార్థులకు శాశ్వతంగా ఉపయోగపడేలా చర్యలు
  • జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు విస్తృత ప్రచారం
  • ముద్ర ప్రతినిధి తో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్

ముద్ర ప్రతినిధి, ఖమ్మం :ఈనెల 30 జరగనున్న పోలింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. తమ లక్ష్యం ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ను ‘ముద్ర ప్రతినిధి’ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో పలకరించగా అనేక విషయాలు వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఏర్పాటు చేస్తున్నాం., వాటిని పెయింటింగ్ ,మరమత్తులు , టాయిలెట్స్ లాంటి వాటిని శాశ్వత ప్రాతిపదికన పనులు చేయించామని చెప్పారు. అవి ముందు ముందు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తీర్చుదిద్దుతున్నామని వివరించారు. రాష్ట్రంలో ఈవిధంగా చేస్తున్న జిల్లా ఖమ్మం ఒక్కటేనన్నారు. ఎలాగూ పోలింగ్ సందర్భంగా ఓట్లర్లకు పోలింగ్ స్టేషన్ల వద్ద కనీస సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని, వాటిని పూర్తి స్థాయిలో చేస్తే రేపు విద్యార్థులకు మేలు చేసినవారమవుతామని అన్నారు. తమ మరో లక్ష్యం ఓటింగ్ శాతం బాగా పెంచడం, అందుకు ఇప్పటికే విస్తృత ప్రచారం కల్పించాం, గ్రామీణ ప్రాంత ఓటర్లకన్నా పట్టణప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా పోల్ అవుతుంది.

దానిపై కేంద్రీకరించి పాఠశాల విద్యార్థుల ద్వారా వారి తల్లి దండ్రులకు ప్రమాణ పత్రాలు పంపించి వాటిపై వారితో తప్పకుండా ఓటు వేస్తామని సంతకం పెట్టించి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే లక్షన్నర ప్రమాణ పత్రాలు, 3 లక్షల మంది ఓటర్ల నుంచి సేకరించామని కలెక్టర్ అన్నారు. తన కూతురు కూడా తన దగ్గరకు వచ్చి తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటానని ప్రమాణ పత్రం మీద సంతకం చేయించిందన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 89 శాతం ఓట్లు పోల్ కాగా, ఖమ్మం నియోజకవర్గంలో 76 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయిందన్నారు. అందువల్ల ఖమ్మం నియోజకవర్గంపై ప్రత్యేక డ్రైవ్ పెట్టామని తెలిపారు. జిల్లాలోని ముఖ్యకూడళ్లలో ప్లెక్సీలు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశామని అధికార యంత్రాంగం కృషి ఫలితంగా ఓటింగ్ శాతం 90 శాతం పైగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఖమ్మంలో కూడా 80 నుంచి 85 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. వెబ్ కాస్టింగ్ గతంలో 50 శాతం మాత్రమే ఉండగా 100 శాతం వెబ్ కాస్టింగ్ జరుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. 536 లొకేషన్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనివల్ల ఏ చిన్న సమస్య అయినా వెంటనే గుర్తించే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా 30 పోలింగ్ కేంద్రాలను మానిటర్ చేసేందుకు ఒక వ్యక్తిని నియమించామని, 170 మందికి ఇందుకోసం శిక్షణ కూడా ఇచ్చామని కలెక్టర్ తెలిపారు.


జిల్లాలో 390 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు 
జిల్లాలో 390 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అక్కడ జిల్లాకు వచ్చిన 13 కంపెనీల పారామిలిటరీ బలగాలను ఒక్క కేంద్రానికి 4 గురు సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు ఉంటారని కలెక్టర్ తెలిపారు. వారు కాకుండా ఫ్లైయింగ్ స్కాడ్ ఉంటుందని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 12 లక్షల 16 వేల 690 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు.18 సంవత్సరాల పైబడి కొత్తగా చేరిన ఓటర్లు కూడా ఉన్నారన్నారు.10 వేల మంది పోస్టల్​ బ్యాలెట్ ను ఉపయోగించుకోనున్నారని, ఇప్పటికే 8,300 మంది ఉపయోగించుకున్నారని తెలిపారు.