వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌

వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను సీబీఐ తప్పించింది. ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ సీబీఐ ఇచ్చిన ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.  కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌కు సీబీఐ డీఐజీ కె.ఆర్‌.చౌరాసియా నేతృత్వం వహించనున్నారు. సిట్‌ బృందంలో ఎస్పీ వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముఖేశ్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.శ్రీమతి, నవీన్‌ పునియా, ఎస్సై అంకిత్‌ యాదవ్‌ కూడా ఉన్నారు.  

కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. ఏప్రిల్‌ 30లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలని నిర్దేశించింది. ఇప్పటికే ఈ కేసు విచారణ ఆలస్యమవుతోందని.. కాబట్టే కాలపరిమితిని విధిస్తున్నట్లు తెలిపింది.  మరోవైపు కేసు విచారణ ఆలస్యమవుతున్నందున ఏ5 నిందితుడు శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన భార్య తులసమ్మ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం.. 6నెలల్లోపు ట్రయల్‌ మొదలుకాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్‌ వేసుకోవచ్చని అవకాశం ఇచ్చింది. అయితే, మెరిట్స్‌ ఆధారంగానే బెయిల్‌పై నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం బెయిల్‌ పిటిషన్‌పై ఉండదని తెలిపింది.