Padma Awards 2023 Winners సినీ పద్మాలు
కీర... వాణీయం
సీనియర్ సింగర్ వాణీ జయరామ్ ని పద్మ భూషణ్ అవార్డు వరించింది. రిపబ్లిక్ డే పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుని ప్రకటించింది. ఈ జాబితాలో సంగీత దర్శకుడు కీరవాణి, నటి రవీనా టాండన్ పద్మ శ్రీకి ఎంపిక కాగా.. వాణీ జయరామ్ పద్మభూషణ్ కి ఎంపిక అయ్యారు. వాణీ జయరామ్ తెలుగు తమిళం, హిందీ ఇలా అన్ని ప్రధాన భాషల్లో ఎన్నో మధురమైన పాటలు పాడారు. తమిళనాడు వేలూరులో జన్మించిన వాణీ జయరామ్ దాదాపు 5 దశాబ్దాలు సంగీత ప్రియులని తన గాత్రంతో అలరించారు.చిన్నవయసులోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతూ వాణీ జయరామ్ తన ప్రతిభ చాటుకున్నారు. వివాహం తర్వాత తన భర్త ప్రోత్సాహంతో గాయనిగా మరింత ఎదిగారు.
1975లో వాణీ జయరామ్ తొలిసారి తమిళ చిత్రం అపూర్వ రాగంగళ్ లో పాడిన పాటలకి గాను ఆమె జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆల్ టైం క్లాసిక్ శంకరాభరణం చిత్రంలో పలు పాటలు పాడి మరోసారి జాతీయ అవార్డు కైవసం చేసుకున్నారు. 1991లో స్వాతికిరణం చిత్రానికి మూడవసారి ఆమెకి నేషనల్ అవార్డు దక్కింది. తెలిమంచు కరిగింది.. ఎన్నెన్నో జన్మల బంధం.. ఒక బృందావనం లాంటి సూపర్ హిట్ సాంగ్ ఆమె గాత్రం నుంచి జాలువారినవే. అన్ని భాషల్లో కలిపి ఆమె 14 వేల పాటలు పాడారు. కెవి మహదేవన్, ఇళయరాజా, ఎమ్మెస్ విశ్వనాథ్ , చక్రవర్తి లాంటి ప్రముఖ సంగీత దర్శకులు వాణీ జయరామ్ తో పాటలు పాడించారు. ఈ మధుర గాయానికి పద్మభూషణ్ రావడంతో అభిమానులు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఆమెని అభినందిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు.
పాటల పెద్దన్నకీరవాణి
కీరవాణికి నాలుగేళ్ళ వయసున్నప్పుడు తన తండ్రి అతడిని కర్ణాటక సంగీతం నేర్పించే కవిఠపు సీతన్న వద్ద జాయిన్ చేశాడు. అయితే కీరవాణికి కేవలం నాలుగు సంవత్సరాలే ఉన్నప్పటికీ గురువు చెప్పే సంగీత మెలకువలను ఒక పట్టాన ఒడిసిపట్టే వాడట. పదవ తరగతి పూర్తయిన అనంతరం తండ్రి కీరవాణికి గిటార్ నేర్పించారు..అలాగే గీత రచన కూడా నేర్చుకోవాలని ఉద్దేశంతో వేటూరి సుందర రామ్మూర్తి వద్ద అసిస్టెంట్ గా చేరాడు. అయితే ఒక సంవత్సరం పాటు వేటూరి సుందర్రామ్మూర్తి వద్ద పనిచేసిన కీరవాణి తన మంచి ప్రవర్తనతో అతని మన్నలను పొందాడు. కీరవాణి మంచి మనసును తెలుసుకున్న వేటూరి సుందర రామ్మూర్తి అతడిని వేటూరి రామోజీరావు కి పరిచయం చేసి గొప్పగా చెప్పాడు.
అదేసమయంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కింద మనసు మమత సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో రామోజీ రావు కీరవాణి మనసు మమత సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. శివ సినిమా లో చేసే అవకాశం కోల్పోయినప్పటికీ ఉషాకిరణ్ మూవీస్ వంటి ప్రముఖ బ్యానర్ లోని సినిమాకి సంగీత బాణీలను అందించే అవకాశం రావడంతో అతను బాగా సంతోషించాడు. తన మొదటి సినిమా కావడంతో తన సంగీత నైపుణ్యాన్ని మొత్తం ఉపయోగించి మనసు మమత అనే సినిమాకి అద్భుతంగా సంగీత బాణీలను అందించాడు. ఎక్కడ సంగీతాన్ని ఎక్కువగా సమకూర్చారో ఎక్కడ తక్కువగా సమకూర్చారో జాగ్రత్త పడి పరిమితులు దాటకుండా సంగీతాన్ని ఎక్కువగా అందించకుండా ఒక లయబద్ధంగా ఉండే అద్భుతమైన సంగీతాన్ని మనసుమమత సినిమాకి సమకూర్చి అందరి ప్రశంసలను పొందాడు కీరవాణి. అభిమానులు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.