పెంబర్తి, చంద్లాపూర్​కు  అంతర్జాతీయ ఖ్యాతి

పెంబర్తి, చంద్లాపూర్​కు  అంతర్జాతీయ ఖ్యాతి
  • ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ప్రకటించిన కేంద్రం
  • కాకతీయుల కాలం నుంచి హస్తకళలకు ప్రసిద్ధిగా పెంబర్తి
  • గొల్లభామ చీరలకు స్పెషల్ చంద్లాపూర్​
  • ఈనెల 27న ఢిల్లీలో అవార్డు అందజేత

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మరో రెండు గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్రం ఎంపిక చేసింది. జనగామ జిల్లా పెంబర్తి గ్రామంతో పాటు సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ గ్రామాలను ఈ సంవత్సరంలో ఉత్తమ గ్రామాలుగా ప్రకటించింది. కాకతీయుల కాలం నుంచి పెంబర్తి గ్రామం హస్తకళలకు ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. 

విదేశాలకు పెంబర్తి కళాకృతులు..

ఇత్తడి, కంచు లోహాలతో ఈ గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళా ఖండాలు, గృహాలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి.. తద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇనుము వినియోగం తెలియక ముందునుంచే రాగి, ఇతర మిశ్రమ లోహాల సహాయంతో కాకతీయుల కాలం నుంచి పనిముట్లను, రోజూవారీ వినియోగ వస్తువుల తయారీకి పెంబర్తి  కేంద్రంగా ఉంది.  

రాష్ట్ర కళా సంస్కృతికి ప్రతిబింబాలుగా గొల్లభామ చీరలు.. 

చంద్లాపూర్ గ్రామాంలో  నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభామ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలిచాయి. కళాత్మకత, చేనేతల కలబోతకు ఈ చీరలు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. ఇక్కడి రంగనాయక స్వామి దేవాలయం, పరిసర ప్రాంతాలు గ్రామీణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందాయి. ఈ నేపథ్యంతోపాటుగా ఇక్కడి గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కారణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులను ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27న ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అందజేయనున్నారు. తెలంగాణ ప్రాంతంలోని కళాకృతులకు కేంద్రం ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని కల్పించింది. ఇటీవల జరిగిన జీ-20 సమావేశాల్లో భూదాన్ పోచంపల్లి ఇక్కత్ చీరలను, ఇక్కడి నేతన్నలు నేసిన కండువాలను వివిధ దేశాల అధినేతలకు, విదేశీ ప్రముఖులకు అందజేశారు. వివిధ విభాగాలకు సంబంధించిన జీ20 సమావేశాలకు హాజరైన విదేశీ ప్రతినిధులకు కూడా పోంచపల్లిలో నేసిన చీరలను కేంద్ర ప్రభుత్వం ద్వారా గిఫ్ట్‌లుగా అందజేశారు. 2021లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి యూఎన్ డబ్ల్యూటీఓ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించే విషయంలోనూ కేంద్రప్రభుత్వం ప్రత్యేక చొరవతీసుకున్న సంగతి తెలిసిందే.