పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తాం
అమరావతి: సీఎం జగన్ అరాచకాల నుంచి వైసీపీ నేతల్ని కూడా తామే కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎంపీ రఘురామ రాజు సుబ్బారావు గుప్తాలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించే పోలీసులను ఉపేక్షించేది లేదని, చేసిన తప్పులకు వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. రాష్ట్రంలో రావణ కాష్టం తరహా పరిస్థితులు నెలకొంటే.. టీడీపీ లీగల్ సెల్ అందుకు దీటుగా పని చేస్తోందని పేర్కొన్నారు.
వైసీపీ అరాచకాల దెబ్బకు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదన్న చంద్రబాబు.. ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ఎన్టీఆర్ భవన్ సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. నాలుగేళ్లలో తెలుగుదేశం శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై చర్చించారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులపై సమావేశంలో చర్చ జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ న్యాయవిభాగం అనుసరించాల్సిన విధానాలపై సమీక్షించారు.