బీఆర్‌ఎస్‌తో పొంగులేటి తెగదెంపులు..

బీఆర్‌ఎస్‌తో పొంగులేటి తెగదెంపులు..
ponguleti srinivasa reddy

మునుగోడు ఎన్నికల అయిపోగా ఖమ్మంపై ఫోకస్‌ పెట్టింది కాషాయదళం. అసంతృప్తితో ఉన్న పొంగులేటిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చాలా కాలంగా బీఆర్‌ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గులాబీ పార్టీలో అన్యాయం జరిగిందని ఆయన ఇటీవల చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఆగ్రహించిన గులాబీ హైకమాండ్‌ ఆయనకు ప్రభుత్వ భద్రత కుదించడం, ఎస్కార్ట్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కారు దిగి కమలం గూటికి చేరుతారనే ప్రచారానికి బలం చేకూరింది. ఖమ్మంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పొంగులేటి తన మనసులోమాట బయట పెట్టారు. రాబోయే రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రానికి తాను సిద్ధంగా ఉన్నానని కుండబద్దలు కొట్టారు. ప్రజల అభిమానం ఉన్నవాడే అసలైన నాయకుడని, తనకు పదవి లేకపోయినా ప్రజాభిమానం ఎంతో ఉందన్నారు. పొంగులేటితో ఏకంగా బీజేపీ ఢల్లీి పెద్దలే రంగంలోకి  దిగి సంప్రదింపులు జరుపుతున్నారు. ఈనెల 19న ఢల్లీిలో ప్రధాని మోదీ., కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలతో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి భేటీ కానున్నారు. మోదీ, అమిత్‌ షా సమక్షంలో పొంగులేటి కమల దళంలో చేరిపోనున్నారు. మోదీ, అమిత్‌ షాలతో సమావేశం తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభకు పొంగులేటి ప్లాన్‌ చేస్తున్నారు. మంగళవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనుచరులతో భేటీ కానున్నారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కూడా నెమ్మదిగా బీజేపీ వైపు చూస్తున్నట్టు పొలిటికల్‌ సర్కిళ్లలో టాక్‌ వినిపిస్తోంది. పొంగులేటితోపాటు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మట్టా దయానంద్‌, పిడమర్తి రవి కూడా చేరుతారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. మధిర నియోజకవర్గం నుంచి కోటా రాంబాబు, బమ్మెర రామ్మూర్తి, మెండెం కిరణ్‌ కుమార్‌. పినపాకనియోజకవర్గం నుంచి పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం నియోజకవర్గం నుంచి తెల్లం వెంకట్రావ్‌, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, వైరా నుంచి బర్ర రాజశేఖర్‌, సుతకాని జైపాల్‌, పాలేరు నుంచి మద్దినేని బేబీ స్వర్ణకుమారి కూడా కమల తీర్థం పుచ్చుకుంటారని టాక్‌ వినిపిస్తోంది. కానీ ఎవరూ ఇప్పటివరకు నిర్ధారించలేదు. బీజేపీ అనేసరికి చాలామంది వెనుకడుగు వేస్తున్నట్టు కూడా లోకల్‌గా చెప్పుకుంటున్నారు.  ఈనెల 18న ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ మహాసభను నిర్వహించాలని గులాబీ దళపతి సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అదే రోజు ఖమ్మం కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వంద ఎకరాల మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటైన తర్వాత తొలి బహిరంగ సభకు లక్షమందికి పైగా జన సవిూకరణ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.