బీజేపీకి రాజగోపాల్​ గుడ్​బై 

బీజేపీకి రాజగోపాల్​ గుడ్​బై 
  • కొంత కాలంగా  కమలం నాయకత్వంపై అసంతృప్తి
  • కాంగ్రెస్​నుంచి మునుగోడు బరిలోకి ? 

ముద్ర ప్రతినిధి, నల్గొండ : తెలంగాణలో బీజేపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలించిది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం బీజేపీకి రాజీనామా చేశారు. కార్యకర్తల నిర్ణయం మేరకే తాను పార్టీ వీడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఎల్లుండి రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.  గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచారు. 2022 నవంబర్‌లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీలోనే కొనసాగిన ఆయన పార్టీ కార్యక్రమాలకు మాత్రం కాస్త దూరంగానే ఉంటూ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వంపై ఆయన కొంత కాలంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మారనున్నారని, కాంగ్రెస్ గూటికి చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా ఎప్పటికప్పడూ ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి హవా తగ్గిపోవడం, కాంగ్రెస్ బలం పుంజుకోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి మునుగోడు నుంచే బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారట.  కాగా, ఆదివారం బీజేపీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు లేదు. మునుగోడులో ఇప్పటికీ కాంగ్రెస్ బలంగా ఉండడం, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వైపు గాలి వీస్తుండడంతో ఆయన పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నారు.