వైసీపీకి రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా

వైసీపీకి రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా

నెల్లూరు : వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి పంపారు. దీన్ని తక్షణమే ఆమోదించాలని కోరారు. రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి పేర్కొన్నారు.

వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన గతంలో ప్రకటన చేశారు. అనంతర పరిణామాల్లో పేరుకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారే తప్ప ఆయనకు కనీస గౌరవం దక్కలేదని వేమిరెడ్డి అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అధిష్ఠానం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎం.డి.ఖలీల్‌ను నియమించిన విషయమై కనీస సమాచారం ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఆ పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. ఈక్రమంలోనే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.