రేవంత్ రెడ్డి కీలక ప్రకటన - త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకు రాబోతున్నాం
ముద్ర,హైదరాబాద్:- నానక్ రామ్ గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందని అన్నారు.
అందుకే హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా మారిందని అన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. విధుల్లో ఉండగా ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగితే పోలీసు శాఖలో ఎలాంటి పరిహారం అందుతుందో.. అలాంటి పరిహారాన్నే ఫైర్ డిపార్ట్ మెంట్ లో కూడా ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
- ప్రమాదం జరిగినపుడు అందరికంటే ముందుండేది ఫైర్ డిపార్ట్ మెంట్. ప్రజల రక్షణ కోసం ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతారు.
- ప్రపంచంతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోంది. నగరంలో శాంతి భద్రతలు సరైన విధంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం.
- గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగింది.
- హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే, మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
- తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తాం. త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకు రాబోతున్నాం.
- అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళతాం.
- ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని 25వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నాం
- మెట్రో రద్దు కాలేదు, ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నాం.
- ఫార్మా సిటీలు కాదు. ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తాం. అపోహలు వద్దు. మా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది.
- మాకు మేమే మేధావులమని భావించం. అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలతో ముందుకెళతాం.
- గతంలో సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ, భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకెళతాం.
- ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మా విధానం. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు.