కోదాడ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం

కోదాడ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం
  • రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న లారీ ని వెనుక నుండి ఢీ కొట్టిన ఎర్టిగా కారు
  • ఆరుగురి మృతి - నలుగురికి గాయాలు

ముద్ర ప్రతినిధి , కోదాడ .... కోదాడ బైపాస్ రోడ్డు , దుర్గాపురం స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న మారుతి ఎర్టిగా కారు లారీని ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో రోడ్డు ప్రక్కన బ్రేక్ డౌన్ అయి ఆగి ఉన్న లారీని గమనించకుండా వెనుక నుండి డీ కొట్టిన ఘటనలో డ్రైవర్ తో సహా ఆరుగురు మృతి చెందారు . ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం పది మంది ప్రయాణిస్తున్నారు . మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తుంది . మృతులలో ఐదుగురు ఎల్ గోవిందాపురం కు చెందిన వారు కాగా , మరొకరు కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన వారు . 

విజయవాడ వద్ద ఉన్న గుణదలలోని చర్చిలో చిన్న పాప లావణ్య కు కు చెవుదిద్దులు కుట్టించడానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది . కారులో ఉన్న మిగతా నలుగురికి తీవ్ర గాయాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు . అలాగే మృత దేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు . గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు మునగాల మండలం ముకుందపురం వద్ద రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందిన ఘటన మరవకముందే మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . ఈ రెండు ప్రమాదలకు ముఖ్య కారణం జాతీయ రహదారిపై లారీలు నిలపడం వలనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు .