సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి
  • వీపనగండ్ల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రక్షిత కె మూర్తి

ముద్ర. వీపనగండ్ల:- క్రైమ్ అగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 Cr.P.C, తదితర కేసులను, మిసింగ్ కేసులలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరితగతిన కనుగొనేలా చేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి అన్నారు.మంగళవారం వీపనగండ్ల   పోలీస్ స్టేషన్ ఎస్పీ  రక్షిత కె మూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలీసుస్టేషన్ లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు వాటి పురోగతిపై  ఎస్సై నందికర్ ను అడిగి కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్ల వారీగా యూ ఐ కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నాని సూచించారు.అరెస్టులు, చార్జ్ షీట్లు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా చూసుకోవాలని వాటికి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నమోదైన కేసులలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అన్నీ ఆదారాలు సేకరించి చార్జిషీట్ ఫైల్ చేయాలన్నారు.

పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను సీసీటిఎన్ఎస్  లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు. మహిళల, చిన్నారుల అదృశ్యం కేసులలో ఏ విధమైన అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వారిని పట్టుకొవటంలో నిబద్ధత చూపించాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని దొంగిలించిన సొత్తును రికవరీ చేయాలన్నారు. బీట్లు, పికెట్స్ ఏర్పాటు చేసుకొని  తరుచుగా బీట్ చెక్ చేస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు. దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.


దొంగతనాలను అరికట్టేందుకు హైవే రహదారులపై వాహనాల తనిఖీలు చేస్తూ ప్రత్యేక చొరవ చూపాలని, రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వాహన తనిఖీలు చేపట్టి ఎం.వి.చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్ ల మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యం చేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ముందస్తు సమాచారం సేకరించి వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను రవాణా మరియు విక్రయించే వారిపై ఎన్ డి పి ఎస్ కేసులు నమోదు చేయాలన్నారు.  ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా వ్యవహరించి పూర్తిస్థాయిలో విచారణ దర్యాప్తు చేసి ఖచ్చితమైన ఆధారాలతో కోర్టుకు సమర్పించి బాధితులకు సరైన న్యాయం చేయాలన్నారు.