ఫిబ్ర‌వ‌రి 4న 'ప‌ద్మ' పుర‌స్కార విజేత‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌న్మానం

ఫిబ్ర‌వ‌రి 4న 'ప‌ద్మ' పుర‌స్కార విజేత‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌న్మానం
  • మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్ర‌ముఖ సినీ న‌టుడు చిరంజీవిని ఆహ్వానించిన మంత్రి జూప‌ల్లి

ముద్ర.వీపనగండ్ల:- ప్ర‌తిష్మాత్మ‌క పద్మ విభూష‌ణ్, ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన విజేత‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం  ఘ‌నంగా స‌త్క‌రించాలని నిర్ణ‌యించింద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి  కృష్ణారావు అన్నారు.ఫిబ్ర‌వ‌రి 4న శిల్ప‌క‌ళా వేదిక‌లో నిర్వ‌హించే ఈ కార్య‌క్రమానికి రావాలంటూ  మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ను, ప్ర‌ముఖ సినీ న‌టుడు చిరంజీవి ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  త‌ర‌పున ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి  కృష్ణారావు  ఆహ్వానించారు.పద్మ విభూషణ్‌ అవార్డుకు ఎంపికైన సంద‌ర్భంగా జూబ్లిహిల్స్ లోని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ను ఆయన నివాసంలో,  అన్న‌పూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి ని మంత్రి జూప‌ల్లి కృష్ణరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

శాలువాల‌తో సత్క‌రించి, పుష్ప‌గుచ్చాలు అంద‌జేసి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాల‌కు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి, ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్‌ చిరంజీవి, ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్‌ సోమ్‌లాల్‌, శిల్పకారుడు స్త‌ప‌తి ఆనందాచారిని  రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఘ‌నంగా స‌త్క‌రించ‌నుంది.ప‌ద్మ‌శ్రీ పుర‌స్కార విజేత‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ఆహ్వానం అందించాల‌ని సాంస్కృతిక శాఖ అధికారుల‌ను మంత్రి జూప‌ల్లి  ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో  సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ మామిడి హ‌రికృష్ణ  పాల్గొన్నారు.