కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి సుభాష్‌

కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి సుభాష్‌

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మరికొందరు మంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించగా.. మిగతావారు కూడా బాధ్యతలు స్వీకరించే పనిలో పడ్డారు. ఇవాళ సచివాలయంలోని 5వ బ్లాక్‌ లో వేద పండితులు ఆశీర్వచనాల మధ్య కార్మిక శాఖ మంత్రిగా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తామన్నారు. ఇక, వైసీపీ ప్రభుత్వం 2019 నుండి 1.25 కోట్ల మంది కార్మికులకు మాత్రమే బీమా సదుపాయం కల్పించింది.. కానీ, చంద్రన్న పాలనలో కార్మికులు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. ఇసుక లభ్యత లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు అనేక కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్‌ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.