బాసరలో పులిహోర ప్రసాదం ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తున్న ఆరుగురి సస్పెన్షన్...

బాసరలో పులిహోర ప్రసాదం ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తున్న ఆరుగురి సస్పెన్షన్...

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా బాసరలో అక్రమంగా పులిహోర ప్యాకెట్లు తరలిస్తున్న క్రమంలో ఆరుగురు ఉద్యోగులు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బాసర ప్రసాదం స్టోర్ నుంచి విక్రయించే కౌంటర్లకు ప్రసాదం తరలిస్తున్న వాహనంలో ప్యాకెట్లకు రిజిస్టర్ లో నమోదు చేసిన ప్యాకెట్ల సంఖ్యకు వ్యత్యాసం ఉంది. పూజకు వచ్చిన స్థానికులు బండి ఆపి పరిశీలించారు. ఈ పరిశీలనలో బండిలో 690 ప్యాకెట్లు ఉంటే రిజిస్టర్ లో మాత్రం 350 గా నమోదు చేశారు. ఈ అంశాన్ని గ్రామస్తులు ఆలయ ఈ ఓ విజయ రామారావు కు చేరవేశారు. దీంతో ఆయన టికెట్ కౌంటర్లో పరిశీలించారు. ఈ పరిశీలనలో చించని టిక్కెట్లు పట్టుబడటంతో ప్రసాదం కౌంటర్ ఇన్చార్జి పై మండి పడ్డారు. ఈ అంశంపై ఇఓ విజయ రామారావు ముద్ర ప్రతినిధి తో మాట్లాడారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న ఆరుగురిపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రసాదం ప్యాకెట్లను అక్రమంగా అమ్మేందుకు యత్నించిన ఈ ఆరుగురిలో నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులు కాగా, మరో ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులు. అవక తవకలకు పాల్పడితే చర్యలు తప్పవని విజయ రామారావు స్పష్టం చేశారు.