ఇకపై టీడీపీ అన్స్టాపబుల్ అని, గేరు మారుస్తామని, స్పీడు పెంచుతామని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్తామని చంద్రబాబు హెచ్చరించారు. అనురాధ గెలుపు జగన్ సర్కార్కు చెంపపెట్టని, తప్పులు చేయడం.. రాష్ట్రాన్ని దోచుకోవడమే జగన్ పని మండిపడ్డారు. వైసీపీ విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కి వెళ్లామని, ప్రజావేదికను కూలగొట్టిన రోజే జగన్ వైఖరేంటో అర్ధమైందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని, జగన్ చేసిన అవమానాలను ప్రజలు భరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ గాల్లో పల్టీలు కొట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు.
జగన్ ఎంతో కసరత్తు చేశారు. చివరికి బొక్క బోర్లా పడ్డారన్నారు. నలుగురు ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని బయటపెట్టారని, బయటకు రాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని తెలిపారు. వైసీపీ సేవాదళ్ అధ్యక్షుడే ఆ పార్టీలో ఉండలేకపోయారని, నమ్మకంగా ఉండే నేతలే జగన్ను వీడి వెళ్తున్నారని తెలిపారు. పులివెందుల లో కూడా టీడీపీ జెండా ఎగిరిందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జగన్కు షాకిచ్చాయని, తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయని తెలిపారు. జగన్రెడ్డి రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. గిరిధర్రెడ్డి చేరికతో పార్టీ మరింత బలపడుతుందన్నారు. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని జగన్ చూశారని, దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడని చంద్రబాబు తెలిపారు.