జర్మనీ లో తెలంగాణా ఫుడ్ ఫెస్టివల్

జర్మనీ లో తెలంగాణా ఫుడ్ ఫెస్టివల్
  • ఆకట్టుకున్న తెలంగాణా రుచులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలుగువారు ఉద్యోగాలు, చదువుల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ తదితర పలు జిల్లాలకు చెందిన యువతీ యువకులు జర్మనీ వాసులకు తెలంగాణా వంటల రుచి చూపించారు. జర్మనీ దేశంలో  మ్యూనిచ్ అనే పట్టణంలో శనివారం రాత్రి ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. అక్కడి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర వంటకాలు చికెన్ కర్రీ, బిర్యానీ, వడలు, సకినాలు, బూరెల వంటి వంటకాలని అక్కడి ప్రజలకు రుచి చూపించారు.

ముఖ్యంగా జర్మనీ ప్రజలు డబుల్ కా మీఠా చాలా ఇష్టపడ్డారు. అక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగస్తులు ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఒడిషా,తమిళనాడు,  కర్ణాటక విద్యార్థులు కూడా ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన అజయ్ కుమార్, శ్రీలత లు కూడా వారు చేసిన వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపించారు. ఇలాంటి ఫెస్టివల్స్ ఇక్కడ జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు ప్రజలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల వారు ఒకచోట కలుసుకొని భారత దేశ వంటకాలను రుచి చూసే అవకాశం కల్పించారు. జర్మనీ దేశస్తులకు మన దేశ వంటకాల రుచి చూపించడం, మన దేశ వంటకాల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందని అజయ్ కుమార్, శ్రీలత దంపతులు తెలిపారు .