మూల్యం చెల్లించుకున్నా ‘నిజమే చెబుతా’
తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసం ఖాళీ చేసిన రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రాహుల్గాంధీకి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. లోక్సభ సభ్యత్వం రద్దుతోబాటు, ఆయన ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా లోక్సభ సచివాలయం నోటీసులిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం రాహుల్గాంధీ తుగ్లక్రోడ్లోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజం చెబితే వచ్చిన ప్రతిఫలం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ ప్రజలు తనకు 19 ఏళ్ల నుంచి ఈ ఇంటిని ఇచ్చారన్నారు.
వారికి ధన్యవాదాలు తెలిపారు. కానీ తన ఇళ్లు లాక్కున్నారన్నారు. నిజం చెబితే మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా తాను నిజమే చెబుతానని స్పష్టం చేశారు. తాను కొంతకాలంపాటు తన తల్లి సోనియాగాంధీ నివాసంలో ఉంటానన్నారు. శనివారం సెలవు రోజు కావడంతో తుగ్లక్రోడ్లోని తన నివాసం తాళం చెవులు సచివాలయానికి రాహుల్గాంధీ అప్పగించలేదు. శుక్రవారం ఇంటి నుండి సామాగ్రిని తరలించారు.